రిలీజ్ డేట్లు.. షాకుల మీద షాకులు

ఈ శుక్రవారం నాని సినిమా ‘నిన్ను కోరి’ విడుదలవుతోంది. వచ్చే వారం ‘శమంతకమణి’ వస్తుంది. తర్వాత వరుసగా ఫిదా, గౌతమ్ నంద, నేను రాజు నేనే మంత్రి.. ఆపై వారం లై, జయ జానకి నాయక రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఇవి మాత్రమే ఆయా వారాంతాల్లో రిలీజవుతాయని భావిస్తుండగా.. ఉన్నట్లుండి ఆశ్చర్యకరంగా కొత్త సినిమాలు రేసులోకి వచ్చేస్తున్నాయి.

అసలు వార్తల్లోనే లేని మూడు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు సినిమా ‘పటేల్ సార్’ గురించి. ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లి మూడు నెలలే అయింది. ఐతే అంతలోనే విడుదలకు సిద్ధమైపోయింది. నాలుగు రోజుల కిందటే ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన చిత్ర బృందం.. ఈ నెల 14నే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంటే సోలోగా వస్తుందనుకున్న ‘శమంతకమణి’కి పోటీ తప్పదన్నమాట.

అలాగే 21న రాబోతున్న ‘ఫిదా’కు కూడా ఇదే పరిస్థితి ఎదురవబోతోంది. ఆ రోజు కృష్ణవంశీ సినిమా ‘నక్షత్రం’ కూడా విడుదలవుతుందట. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు. వేరే డేట్ ఏదీ సర్దుబాటు కాకపోవడంతో వరుణ్ మీదికి సాయిధరమ్‌ను వదలడానికే రెడీ అయిపోయారు. తొలిసారి ఇద్దరు మెగా హీరోల మధ్య పోరు చూడబోతున్నామన్నమాట.

ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పటికీ తర్వాతి వారానికి ఓ చిన్న సినిమా షెడ్యూలైంది. తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ ‘ఆనందో బ్రహ్మ’ను ఆగస్టు 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.