ఆమెను తప్పించారా.. లేక సెకండ్ హీరోయినా?

నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కువగా కొత్త అమ్మాయిలు.. అప్‌కమింగ్ హీరోయిన్లతోనే పని చేస్తుంటాడు. అతడి సినిమాల్లో చాలా వరకు అలాంటి హీరోయిన్లే నటించారు. డెబ్యూ డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఎంఎల్ఏ’ సినిమాకు కూడా ఓ అప్‌కమింగ్ హీరోయిన్నే తీసుకోవాలని అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. వంశీ సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించిన మనాలి రాథోడ్‌ను ఈ సినిమాలో కథానాయికగా ఎంచుకున్నట్లుగా వారం కిందట వార్తలొచ్చాయి. కానీ సినిమా ప్రారంభోత్సవం రోజు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అని ప్రకటించారు. మధ్యలో ఏం జరిగిందో అర్థం కాలేదెవరికీ.

మనాలి రాథోడ్ ఇప్పటిదాకా చిన్నా చితకా సినిమాలే చేసింది. ‘గ్రీన్ సిగ్నల్’ అనే నాసిరకం సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. వంశీ సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్’ తన కెరీర్ ను మలుపు తిప్పేస్తుందని ఆశించింది కానీ.. అలాంటిదేమీ జరగలేదు. అందులో ఆమె పాత్ర కూడా అంతంతమాత్రమే. మనాలి గురించి ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత బాగా లేదు. కళ్యాణ్ రామ్ సరసన మనాలి హీరోయిన్ అనగానే సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెకు కళ్యాణ్ రామ్ సరసన చేసేంత సీన్ లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మరి ఈ ఫీడ్ బ్యాక్ చూసి మనాలిని కాదని కాజల్‌కు అవకాశమిచ్చారా లేక ఆమెను సినిమాలో చిన్న రోల్‌కు ఎంచుకుని.. లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ కాజల్‌కు ఇచ్చారా అన్నది తెలియదు. మనాలి సంగతలా వదిలేస్తే కాజల్ కథానాయికగా పరిచయమైంది కళ్యాణ్ రామ్ సినిమా ‘లక్ష్మీకళ్యాణం’తోనే అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఎన్టీఆర్ కు లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కాజల్ తో మళ్లీ కళ్యాణ్ రామ్ జోడీ కడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. నందమూరి అభిమానులు కూడా కాజల్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.