అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు నీల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో ”సలార్” ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

‘ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మ్యాన్.. ది మోస్ట్ వైలెంట్’ అంటూ ప్రభాస్ ను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేసి నీల్ అందరినీ సర్ప్రైజ్ చేసాడు. అయితే రోజురోజుకూ ఈ సినిమాపై పెరుగుతున్న అంచనాలు దర్శకుడి పై ఒత్తిడి పెంచుతుందేమో అనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది.

‘ఉగ్రమ్’ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్.. ‘కేజీయఫ్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిజం – ఎలివేషన్స్ తో పాటుగా సెంటిమెంటును జోడించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కేజీయఫ్: చాప్టర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది.

సినిమా మొత్తం యాక్షన్ – ఎలివేషన్స్ తో నింపేసి రెండో భాగంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు నీల్. ఇప్పుడు దర్శకుడు ‘సలార్’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టడానికి రెడీ అయ్యాడు. నిజానికి ‘కేజీయఫ్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేసి కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేశారు.

‘KGF 2’ రిలీజ్ మరియు ప్రమోషన్స్ కారణంగా ‘సలార్’ సినిమా షూటింగ్ కు కాస్త విరామం తీసుకోవలసి వచ్చింది. వచ్చే నెల నుండి తిరిగి చిత్రీకరణ ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లేటెస్ట్ మూవీ సక్సెస్ తదుపరి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ చేయడమే కాదు.. దర్శక హీరోలపై ఒత్తిడి పెంచుతుంది.

‘కేజీఎఫ్’ ప్రాంఛైజీకి మించి ‘సలార్’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ – హీరోయిజం ఎలివేషన్స్ ను డార్లింగ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ అంచనాలను అందుకోవడం అంత సులువు కాదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కు ఇప్పటికే ‘సాహో’ తో అలాంటి అనుభవం ఎదురైంది.

ఇటీవల ‘రాధే శ్యామ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ రాబోయే సినిమాలతో మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘సలార్’ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాల కంటే ఈ ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇది ప్రశాంత్ నీల్ పై బాధ్యతతో పాటుగా ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు.

అందులోనూ ‘బాహుబలి’ ‘కేజీఎఫ్’ ప్రాంఛైజీల తరహాలోనే ‘సలార్’ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా చేస్తున్నారని టాక్ ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. హోంబలే బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు మరియు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘కేజీయఫ్’ చిత్రానికి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా ‘సలార్’ కు పని చేస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ అంచనాలకు అందుకొని ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.