‘రాధేశ్యామ్‌’ వ్యాలెంటైన్స్‌ డే టీజర్‌ కోసం వెయిటింగ్‌

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. దాదాపు రెండేళ్లుగా సినిమా గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్నో సార్లు ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ అదుగో ఇదుగో అంటూ ప్రచారం జరిగిన తర్వాత వచ్చింది. ఇక టీజర్‌ కోసం కూడా గత ఆరు నెలలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీజర్ ను వ్యాలెంటైన్స్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాధేశ్యామ్‌ టీజర్‌ అంటూ ట్విట్టర్ లో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది.

వ్యాలెంటైన్స్ డే సందర్బంగా రాబోతున్న ఈ టీజర్‌ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా సినిమా వస్తుందని కొన్ని రోజుల క్రితం పుకార్లు పుట్టించారు. మరి ఈ టీజర్ విషయం కూడా అంతేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే యూనిట్‌ సభ్యులు స్పందించాలి. యూవీ క్రియేషన్స్ వారు ఎంతగా ప్రచారం జరుగుతున్నా కూడా వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. రాధేశ్యామ్‌ టీజర్‌ కనుక వ్యాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల కాకుంటే మళ్లీ యూవీ క్రియేషన్స్ వారిపై బ్యాడ్‌ ప్రచారంకు తెర లేపే అవకాశం ఉంది.