రాజమౌళి ఎందుకంత భయపడ్డాడు!

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి ఆ తర్వాత ఆ చిత్రం ప్రమోషన్లకీ దోహదపడ్డాడు. క్రిష్‌ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్లీ ఒక బహిరంగ లేఖ రాశాడు. దీంతో రాజమౌళి ఇదంతా కావాలని చేస్తున్నాడని, మెగా క్యాంప్‌కి వ్యతిరేకంగా బాలకృష్ణ సినిమాని లేపుతున్నాడని మెగా అభిమానులనుంచి ఆరోపణలు మొదలయ్యాయి.

దీంతో రాజమౌళి కూడా కంగారు పడినట్టున్నాడు. అందరికీ కావాల్సిన వాడిగా పేరు తెచ్చుకున్న తనని ఇప్పుడో క్యాంప్‌కి పరిమితం చేస్తున్నారని గ్రహించాడు. అందుకే అసలు ఆ లేఖ తాను రాయనేలేదని, దానిని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పబ్లిసిటీ టీమ్‌ అత్యుత్సాహంతో సృష్టించిందని బాంబు పేల్చాడు. రాజమౌళి సైలెంట్‌గా వుండిపోతాడని ఆ సినిమా యూనిట్‌ భావించి వుంటుంది.

నిజంగానే వదిలేసి వుండేవాడేమో, తనపై ఇలాంటి అపవాదులు రాకపోయినట్టయితే. కానీ తన అత్యుత్సాహాన్ని మీడియా కూడా తప్పుబడుతూ వుండే సరికి డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం జరిగింది చెప్పేసాడు. దీంతో రాజమౌళి పేరుని గౌతమిపుత్ర శాతకర్ణి బృందం వాడుకున్న సంగతి బహిర్గతమైంది.

అసలు లేఖే రాయలేదని తెలిసి కూడా దానికి క్రిష్‌ బదులు రాయడం ఏమిటని ఇప్పుడంతా అతడిని తప్పుబడుతున్నారు. రెండు వర్గాలకి సంబంధించిన వ్యవహారం అన్నప్పుడు మూడో వ్యక్తిని ఇరికించడం సబబు కాదు కదా?