రజినీ దర్శకుడి ఫ్యామిలీ ఫొటో వైరల్ అవుతున్నాయి

రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరోతో కేవలం రెండు సినిమాల అనుభవమున్న దర్శకుడు పని చేయడం అంటే మాటలు కాదు. పా.రంజిత్ ఈ అరుదైన అవకాశమే సంపాదించాడు. అతడి తొలి రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో తెరకెక్కినవేమీ కాదు. తొలి సినిమా ‘అట్టకత్తి’ చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కింది. ఆ తర్వాత కార్తి హీరోగా చేసిన ‘మద్రాస్’ కూడా చిన్న స్థాయి సినిమానే.

ఐతే ఈ సినిమాల రేంజి కంటే కూడా వాటిలో కంటెంట్ చూసి రజినీ అతడికి అవకాశమిచ్చాడు. పా.రంజిత్ నేపథ్యం చాలా ఆసక్తికరమైంది. అతను ఒక దళితుడు. చాలా కష్టాలు పడి ఎదిగాడు. సినీ రంగంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతాడు. వివక్ష కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. దీనికి తోడు తమిళ సినిమాల్లో కానీ.. ఇండియన్ సినిమాల్లో కానీ దళితుల నేపథ్యంలో సినిమాలు రాకపోవడం.. దళిత సమస్యలపై కథలే అరుదైపోవడంపై చాలా ఆవేదన చెందేవాడు రంజిత్.

అందుకే తొలి సినిమా దగ్గర్నుంచి ప్రతి చిత్రంలోనూ అతను దళితవాడలు.. అక్కడి మనుషులు.. అక్కడి సమస్యల నేపథ్యంలోనే కథలు నడిపించాడు. ‘కబాలి’ చూసినా అంతర్లీనంగా అందులో దళితులు.. వారిపై వివక్ష.. వారి సమస్యలపై చర్చ ఉంటుంది. రంజిత్ ఐడియాలజీ నచ్చి అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు రజినీ. ఇప్పుడు రంజిత్-రజినీ కాంబినేషన్లో రాబోతున్న ‘కాలా’లోనూ ఈ అంశాల్ని స్పృశించబోతున్నాడట రంజిత్. తాజాగా రంజిత్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి రజినీని కలిసి గ్రూప్ ఫొటో దిగాడు. ఆ ఫొటోలో ఉన్న మనుషుల్ని చూస్తే రంజిత్ ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చాడో అర్థమవుతుంది. ఇప్పుడు రంజిత్ దర్శకుడిగా నిలదొక్కుకుని కోటీశ్వరుడై ఉండొచ్చేమో కానీ.. అతడి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ఒకప్పటి తరహాలోనే ఉన్నారు. వారిలోని సహజత్వం.. సింప్లిసిటీ.. ఒరిజినాలిటీ ఎవ్వరినైనా ఆకట్టకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.