మిస్టరీ థ్రిల్లర్ కోసం రంగంలోకి మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చాలా ఫాస్టుగా మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా సాయితేజ్ కనిపిస్తాడు. డాన్స్ .. ఫైట్స్ కి సంబంధించిన విషయాల్లో ఎవరూ వంక బెట్టలేకుండా దూసుకుపోయాడు. ఇక యూత్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశాడు. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలను సాయితేజ్ బాగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. 2019లో వచ్చిన ‘చిత్రలహరి’ ఆయనకి మంచి హిట్టును తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుంచి సక్సెస్ అనేది ఆయనకి దూరంగానే ఉంటూ వచ్చింది.

‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఓ మాదిరిగా అనిపించినా ‘సోలో బ్రతుకే సో బటర్’ .. ‘రిపబ్లిక్’ సినిమాలు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. కరోనా ప్రభావం వలన .. ఆ తరువాత సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన ఆయన నుంచి ఇంతవరకూ సినిమా రాలేదు. త్వరలోనే ఆయన ఒక సినిమా చేయనున్నాడు.

మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరగనున్నట్టుగా చెబుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ – బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సుకుమార్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసే దిశగా ప్రణాలికను సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక ఒక తమిళ రీమేకులో పవన్ తో కలిసి సాయితేజ్ చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా బలంగానే వినిపిస్తోంది. తమిళంలో ఆ సినిమా పేరు ‘వినోదాయా సితం’. తంబిరామయ్య – సముద్రఖని ప్రధానమైన పాత్రలను పోషించారు.

తమిళంలో ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించాడు. చాలా తక్కువ బడ్జెట్లో నిర్మితమైన ఈ సినిమా అక్కడ వసూళ్ల వర్షం కురిపించింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాను సముద్రఖని దగ్గరుండి పవన్ కి చూపించాడట. దాంతో పవన్ ఈ సినిమా రీమేకులో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.

ఈ సినిమాతో సాయితేజ్ కెరియర్లో కూడా ఒక హిట్ వేయవచ్చనే ఉద్దేశంతో అతనిని కూడా పవన్ ఇన్వాల్వ్ చేస్తున్నాడని చెబుతున్నారు. పీపుల్ మీడియావారితో కలిసి పవన్ ఈ సినిమాను నిర్మించనున్నాడని అంటున్నారు.