రెండు రోజుల నుంచి ఒక వార్తతో సోషల్ మీడియా.. వెబ్ మీడియా హోరెత్తిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్కు.. నాగబాబు తనయురాలు నీహారికకు పెళ్లి జరగబోతోందని.. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరైతే ఎప్పుడు పెళ్లి అన్న సమాచారం కూడా ఇచ్చేశారు. ఐతే ఇది గాలి వార్త అని.. దీనిపై మెగా ఫ్యామిలీ చాలా అప్సెట్ అయిందని సమాచారం. స్వయంగా సాయిధరమ్ తేజ్ ఈ ప్రచారంపై స్పందించాడు. ఈ వార్తను ఖండించాడు.
వరస ప్రకారం నీహారిక తేజుకు మరదలు కాగా.. అతను మాత్రం ఆమె తనకు చెల్లెలు లాంటిదని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తామందరం ఒకే కుటంటుంలా.. అన్నాచెల్లెళ్ల మాదిరే పెరిగామని.. తమకు పెళ్లేంటని.. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు అధికారికంగా ఒకసారి సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాకు హితవు పలికాడు తేజు. అందులోనూ ఒక మహిళకు సంబంధించిన వార్త రాసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
ఇలాంటి ఆధారరహిత వార్తలు చాలా బాధపెడతాయని తేజు అన్నాడు. తేజు చిరంజీవి సోదరి విజయదుర్గకు పెద్ద కొడుకన్న సంగతి తెలిసిందే. తేజు మాత్రమే కాదు బన్నీ కూడా చరణ్, వరుణ్, నీహారికలను తోడబుట్టిన వాళ్లలా ట్రీట్ చేస్తాడు. మావయ్య అయిన పవన్ను అతను బాబాయి అంటాడన్న సంగతి తెలిసిందే.