ఆగిపోయిన ఆ యంగ్ హీరో సినిమా.. ఎట్టకేలకు

కథ తయారైన ప్రతీ సినిమా పట్టాలెక్కాలని లేదు, పట్టాలెక్కిన ప్రతీ సినిమా విడుదలవ్వాలని లేదు. ప్రతీ ఏడాది ఎన్నో వందల సినిమాలు తెరకెక్కుతాయి. అయితే వాటిలో కొన్ని ఎప్పటికీ వెలుగు చూడవు. వీటిలో ఎక్కువగా అనామక సినిమాలే ఉంటాయి. కాస్త పేరున్న హీరో, దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ ఇలా ఎవరున్నా ఆ సినిమా ఎక్కువగా విడుదలయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అయితే 2013లో తెరకెక్కిన ఒక యువ హీరో సినిమా ఏడేళ్లు కావొస్తున్నా ఇంకా వెలుగు చూడలేదు. ఆ సినిమాపై ఆ హీరో కూడా ఆశలు వదిలేసుకున్నాడు. ఆ చిత్రమే డీకే బోస్. ఆ హీరో సందీప్ కిషన్.

గతేడాది నిను వీడని నీడను నేనే చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ ను అందుకున్న సందీప్ కిషన్ మళ్ళీ తెనాలి రామకృష్ణ అనే నాసిరకమైన సినిమా చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇటీవలే కాలంలో సరైన సక్సెస్ అన్నది లేదు. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రంపై నమ్మకాన్ని పెట్టుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే 2013లో తెరకెక్కి విడుదల కాకుండా ఆగిపోయిన డీకే బోస్ ఎట్టకేలకు వెలుగు చూడబోతోంది. అదేంటి ఇప్పుడు థియేటర్లు లేవుగా. ఎలా విడుదలవుతోంది అనుకుంటున్నారా. ఇప్పుడు విడుదలవుతోంది ఓటిటి ప్లాట్ ఫామ్ లో. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తోన్న విషయం తెల్సిందే. థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూసి విడుదలవ్వక ఆగిపోయిన డీకే బోస్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ త్వరలో విడుదల చేయనుందని సమాచారం. అయితే అది ఎప్పుడు, ఏ ఓటిటిలో విడుదలవుతుందన్నది ఇంకా తెలియలేదు.