ముప్పయ్‌ కోట్లకి రూపాయి తగ్గదు

సంక్రాంతికి విడుదలైన ‘శతమానం భవతి’ అంచనాలకి మించి ఆడేస్తోంది. ఇటీవలి కాలంలో దిల్‌ రాజు మ్యాజిక్‌ పని చేయకపోవడంతో అతని జడ్జిమెంట్‌ పోయిందనే అనుకున్నారంతా.

కానీ దిల్‌ రాజు స్ట్రాటజీ వర్కవుట్‌ అయి, అతను సరిగ్గా పల్స్‌ పట్టినట్టయితే ఆ చిత్రాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నట్టుగా శతమానం భవతి సంచలనాలు చేస్తోంది. రిపబ్లిక్‌ డే హాలిడేతో శతమానం భవతి కలక్షన్లు పాతిక కోట్లని దాటాయి.

నిన్న నైజాం ఒక్క ఏరియాలోనే దాదాపు తొంభై లక్షల షేర్‌ వసూలు చేసింది. వీక్‌ డేస్‌లో ప్రస్తుతం ఖైదీ నంబర్‌ 150 వసూళ్లతో పోటీ పడుతోన్న ‘శతమానం భవతి’ కనీసం మరో పది రోజుల పాటైనా స్టడీగా నడుస్తుందనేది ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ చిత్రం ముప్పయ్‌ కోట్ల షేర్‌ వసూలు చేయడం గ్యారెంటీ అని ట్రేడ్‌ సర్కిల్స్‌ కుండ బద్దలు కొడుతున్నాయి. ఫుల్‌ రన్‌లో ఈ చిత్రానికి ముప్పయ్‌ కోట్లపైనే వస్తుంది తప్ప అందుకు రూపాయి కూడా తగ్గదని చెబుతున్నారు.

విడుదలైనప్పుడు పదిహేను కోట్ల సినిమా అవుతుందేమో అనుకున్నదే ఇప్పుడు అందుకు రెండింతలు సాధిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్ర విజయంతో ఎవరూ శర్వానంద్‌ లేదా దర్శకుడు సతీష్‌ గురించి మాట్లాడుకోవడం లేదు. పూర్తిగా దిల్‌ రాజునే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా మార్కెట్‌ని కాచి వడపోసిన రాజు రైట్‌ టైమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మాగ్జిమం పిండేస్తున్నాడు. శభాష్‌ రాజూ!