రజినీని 420 అనేశాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సంకేతాలిచ్చినప్పటి నుంచి ఆయన చాలా మందికి టార్గెట్ అయిపోయారు. స్వయంగా సినీ పరిశ్రమ నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో దాడి మొదలైపోయింది. భారతీ రాజా.. టి.రాజేందర్.. కస్తూరి లాంటి వాళ్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇక రాజకీయ రంగం నుంచి కూడా విమర్శలు తప్పట్లేదు. ప్రధానంగా తమిళనాడుకు చెందిన వివాదాస్పద నేత సుబ్రమణ్య స్వామి అయితే రజినీ పేరు చెబితే ఇంతెత్తున లేస్తున్నారు. రజినీకాంత్ ఒక ఆర్థిక నేరగాడని.. ఆయన చాలా ఫ్రాడ్ చేశారని ఆయన ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. రజినీ రాజకీయాలకు పనికి రాడని కూడా ఆయన తేల్చేశారు.

తాజాగా సుబ్రమణ్యస్వామి ఫోకస్ మరోసారి రజినీ మీదికి మళ్లింది. సూపర్ స్టార్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్త్ చెకప్ కోసమే అక్కడికి వెళ్లారని అందరూ భావిస్తున్నారు. ఐతే అక్కడెళ్లి రజినీ ఓ నైట్ క్లబ్బులో పోకర్ ఆడుతున్న ఫొటో ఒకటి సుబ్రమణ్యస్వామి చేతికి చిక్కింది. అంతే ఆయనిక రెచ్చిపోయారు. రజినీకాంత్ ఒక 420 అంటూ ట్వీట్ చేశాడు.

ట్రీట్మెంట్లో భాగంగా రజినీ అమెరికాలో పోకర్ ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. రజినీకి డాలర్లు ఎలా వస్తున్నాయో పరిశోధన చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రజినీని భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి తమిళనాట గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ ఆయన అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేత అయిన స్వామి ఇలా రెచ్చిపోతున్నాడని భావిస్తున్నారు.