సమంతకి వడదెబ్బ… షూటింగ్‌ ప్యాకప్‌

సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎర్రటి ఎండల్లో ఈ చిత్రం షూటింగ్‌ని మూడు వారాలుగా చేస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌లో జాయిన్‌ అవడానికి రెండు రోజుల క్రితమే వెళ్లిన హీరోయిన్‌ సమంత ఎండ తాకిడికి వడదెబ్బకి గురయిందట.

దీంతో మరో మూడు రోజులు జరగాల్సిన షెడ్యూల్‌ని ఆపేసి చిత్ర బృందం హైదరాబాద్‌కి తిరిగి వచ్చేస్తున్నారు. మే రెండవ వారం నుంచి తదుపరి షెడ్యూల్‌ మొదలవుతుంది. ఎండల తాకిడి తీవ్రంగా వుండడంతో, అది కూడా కోస్తా జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో షూటింగ్‌ చేసేందుకు అనువైన వాతావరణం లేదు. అయినప్పటికీ ఆ ఎండల్లోనే మూడు వారాల పాటు షూటింగ్‌ చేసారు.

హీరోయిన్‌తో సీన్లు షెడ్యూల్‌ చివర ప్లాన్‌ చేయగా, సమంత మొన్ననే అక్కడికి వెళ్లింది. ఆ ఎండలు అలవాటు లేకపోవడంతో సమంత నిన్న పూర్తిగా షూటింగ్‌ చేయలేకపోయింది. ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో నిన్న షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఈరోజు చేద్దామనుకున్నారు. అయితే ఆమె ఇంకా కోలుకోకపోవడంతో షెడ్యూల్‌కి ప్యాకప్‌ చెప్పేసారు. మరి మే నెలలో ఎండలు ఇంకాస్త తీవ్రంగా వుంటాయి కాబట్టి అప్పుడు ఆ ప్రాంతాల్లో షూటింగ్‌ ఎలా చేయగలరో?