త‌మ‌న్నా సినిమాను ఆపేశారు

మూడేళ్లు దాటిపోయింది బాలీవుడ్లో ‘క్వీన్’ సినిమా వ‌చ్చి. ఆ సూప‌ర్ హిట్ మూవీని సౌత్‌లో రీమేక్ చేస్తారంటూ ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ న‌టుడు, నిర్మాత త్యాగ‌రాజ‌న్ ఈ చిత్రాన్ని ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో ఒకేసారి నిర్మించాల‌నుకున్నాడు. రీమేక్ హ‌క్కులు కూడా తీసుకున్నాడు.

ముందు నాలుగు భాషలతోనూ పరిచయమున్న న‌టీన‌టుల‌తో సినిమా తీసి.. నాలుగు భాషల్లో రిలీజ్ చేయాల‌నుకున్నాడు. త‌ర్వాత ఆయ‌న ఆలోచ‌న మారింది. ఏ భాషకు ఆ భాషకు నటీనటుల్ని దర్శకుల్ని ఎంచుకునే పనిలో రెండేళ్లు గడిపేశారు. ఈ మధ్యే తమిళ, తెలుగు వెర్షన్ల‌కు తమన్నాను.. మలయాళానికి అమలా పాల్ ను.. కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయికలుగా కన్ఫమ్ చేశాడు.  ద‌ర్శ‌కుల్ని కూడా ప్ర‌క‌టించాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ.. ఆ సినిమాను ఆపేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఈ రీమేక్ సంగ‌తి ఎంత‌కూ తెంచ‌క‌పోవ‌డంతో త‌మ‌న్నా వేరే క‌మిట్మెంట్ల‌తో బిజీ అయిపోయింది. త‌మిళ‌.. తెలుగు వెర్ష‌న్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సిన రేవ‌తి కూడా ఈ ప్రాజెక్టును వ‌దిలేసింద‌ట‌. దీంతో ఈ సినిమా అట‌కెక్కేసిన‌ట్లే అంటున్నారు. ‘క్వీన్’ విడుద‌లైనపు ఆ సినిమా గురించి దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ న‌డిచింది. ఆ ఊపులోనే రీమేక్ కూడా కానిచ్చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు హైప్ అంతా పోయింది. కాబ‌ట్టి ఈ ప్రాజెక్టు దాదాపుగా డ్రాప్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.