రివ్యూ రైటర్లపై తేజ సెటైర్లు

ఫిలిం మేకర్స్ రివ్యూ రైటర్ల మీద సెటైర్లు గుప్పించడం మామూలైపోయింది ఈ మధ్య. నెలన్నర కిందట ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకు నెగెటివ్ రివ్యూలిచ్చారన్న కారణంతో సమీక్షకులపై దర్శకుడు హరీష్ శంకర్, హీరో అల్లు అర్జున్ సెటైర్లు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ డైరెక్టర్ తేజ కూడా ఆ జాబితాలో చేరాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చినవాళ్లకు కౌంటర్లు వేశాడు తేజ. ఈ సినిమాను చాలామంది సమీక్షకులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని తేజ అన్నాడు.

సినిమాలో హీరో క్యారెక్టర్ మొదట్లో గొప్పగా అనిపించి.. ఆ తర్వాత డౌన్ అవుతుందని.. క్రమక్రమంగా దిగజారిపోతూ కనిపిస్తుందని.. ఐతే క్యారెక్టర్ పతనాన్ని అర్థం చేసుకోలేక సినిమా పతనంగా భావించి.. ద్వితీయార్ధంలో సినిమా డౌన్ అయినట్లుగా చాలామంది రివ్యూలు రాశారని తేజ అన్నాడు. ఒకప్పుడు మంచి సమీక్షకులు ఉండేవాళ్లని.. సినిమాను సరిగ్గా అర్థం చేసుకునే స్థాయి ఉన్న రివ్యూయర్లు ఇప్పుడు తగ్గిపోయారని అన్నాడు తేజ. తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి అర్థం చేసుకున్న సమీక్షకులూ లేకపోలేదని.. కొందరు ఆ పాయింట్ ను చాలా బాగా పట్టేశారని.. ఇది వాళ్లకు అర్థమవుతుందా అని ముందు తాను సందేహించారని.. అలా పట్టుకున్న వాళ్లకు హ్యాట్సాఫ్ అని తేజ అన్నాడు.

యుఎస్ నుంచి మొదట సెకండాఫ్ విషయంలో నెగెటివ్ రెస్పాన్స్ కనిపించిందని.. కానీ తొలి రోజు తాను శాంతి థియేటర్లో జనాల రెస్పాన్స్ చూశాక మాత్రం సినిమా హిట్టని అర్థం చేసుకున్నానని అన్నాడు తేజ. ఉదయం సినిమా చూసేవాళ్లంతా పారామీటర్లు.. థర్మా మీటర్లు పెట్టుకుని వస్తారని.. వాటితో సినిమాను పొడుద్దామని చూస్తారని.. కానీ సాయంత్రానికి ఒరిజినల్ ఆడియన్స్ వస్తారని.. వాళ్ల తీర్పే ముఖ్యమని.. తన సినిమాకు ఆ ప్రేక్షకులు మంచి ఫలితాన్నిచ్చారని తేజ అన్నాడు.