ఆ సినిమా దెబ్బకి వెంకటేష్‌ డ్రాప్‌!

పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరిన వెంకటేష్‌ తన మార్కెట్‌ రేట్‌కి మించిన బడ్జెట్‌ ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. నిర్మాతలు ముందుకు రాకపోతే తానే నిర్మాతగా మారాలని కూడా అనుకున్నాడు. అయితే సురేష్‌బాబు అడ్డు చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ ముందుకి కదల్లేదు. ఈలోగా పూరి జగన్నాథ్‌ వెళ్లి బాలకృష్ణకి ఇంకో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

వెంకీతో కూడా సినిమా చేస్తానంటూ పూరి చెబుతున్నాడు కానీ రోగ్‌ రిలీజ్‌ అయిన తర్వాత వెంకీ ఆలోచన మారిందని అంటున్నారు. గురుతో పాటే రిలీజ్‌ అయిన రోగ్‌ దారుణమైన ఓపెనింగ్‌ తెచ్చుకోవడంతో పాటు డిజాస్టర్‌ టాక్‌తో నడుస్తూ వుండడంతో ఈ టైమ్‌లో పూరి జగన్నాథ్‌తో సినిమా చేయడం, అందునా భారీ బడ్జెట్‌తో ప్రయోగం చేయడం సరికాదని వెంకటేష్‌ డిసైడ్‌ అయిపోయాడట. పూరితో కంటే తేజ డైరెక్షన్‌లో చేయడం బెటరని అనుకుంటున్నాడట. తేజ తనకోసం ఏదో కథ సిద్ధం చేసాడని తెలిసి అతడిని రమ్మని కబురంపించాడట.

అలాగే శ్రీను వైట్ల కూడా వెంకటేష్‌తో ఒక సినిమా చేద్దామనే ఆలోచనలో వున్నట్టు సమాచారం. మరోవైపు క్రిష్‌ కూడా వెంకటేష్‌తో ఒక డిఫరెంట్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. బాలయ్య సినిమా హిట్‌ అయితే అప్పుడు మళ్లీ పూరితో వెంకీ సినిమా తెర మీదకి వస్తుందేమో కానీ ప్రస్తుతానికి అది డ్రాప్‌ అయిపోయినట్టే.