ప్రభాస్ సినిమాకు ఎవరెవరంటే..

ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ నుంచి బయటికి వచ్చే ఇంకో సినిమా మొదలుపెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో అతను చేయనున్న సినిమా సోమవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘మిర్చి’ తర్వాత అతను నాలుగేళ్ల పాటు ‘బాహుబలి’కే అంకితమైపోయిన సంగతి తెలిసిందే.

తన సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్‌తోనే చేయాలని పట్టుబట్టి కూర్చున్న సుజీత్.. ‘రన్ రాజా రన్’ తర్వాత రెండున్నరేళ్లు విరామం తీసుకుని ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్‌తో సినిమాను మొదలుపెట్టాడు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ‘బాహుబలి’నే. దాని తర్వాతి స్థానం కూడా ప్రభాస్ సినిమానే కాబోతోంది.

ప్రభాస్-సుజీత్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దీనికి పని చేసే టెక్నీషియన్ల వివరాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ లెవెల్లో తీర్చిదిద్దాలని సుజీత్ ఫిక్సయ్యాడని అతను ఎంచుకున్న టెక్నీషియన్లను బట్టే తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాటు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేసిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు.

శ్రీమంతుడు.. ఘాజీ లాంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న మదీని సినిమాటోగ్రాఫర్‌గా ఎంచుకున్నాడు సుజీత్. ఇక తెలుగులో ఒకే ఒక్క సినిమా (కొంచెం ఇష్టం కొంచెం కష్టం) చేసినా తమదైన ముద్ర వేసిన మ్యూజిక్ డైరెక్టర్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2018లో విడుదలవుతుందని ప్రకటించారు.