శ్రీను వైట్లతో సినిమా అనౌన్స్ అయిన తర్వాత వరుణ్ తేజ్ ముందుగా ‘ఫిదా’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. శ్రీను వైట్ల చిత్రానికి కథ ఓకే కావడం లేదని, అనుకున్న విధంగా కథ రాకపోవడంతో ఈ చిత్రాన్ని పక్కనపెట్టి ఫిదా స్టార్ట్ చేసారని వార్తలొచ్చాయి. మీడియా ఒత్తిడి పెరగడంతో ఆదరాబాదరాగా శ్రీను వైట్ల సినిమా మొదలు పెట్టేసారు. అయితే అప్పట్లో మీడియాలో వినిపించిన వార్తలన్నీ నిజమేనట.
కథ విన్న వెంటనే నాగబాబు ద్వితీయార్థంపై అనుమానాలు వ్యక్తం చేసాడట. ఇలాగే వుంటే సినిమా ఆడదని చెప్పాడట. అయితే సెకండాఫ్ వర్క్ చేస్తామంటూ వెళ్లిన శ్రీను వైట్ల ఎంతకీ దానిమీదే కూర్చున్నాడట. ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందంటూ తన ఎక్స్పీరియన్స్ని నమ్మమన్నాడట.
అవసరమైతే కామెడీ పెంచుదామంటూ నాగబాబు ఎంత వద్దంటున్నా వినకుండా ముందు రాసుకున్న కథతోనే సెట్స్ మీదకి వెళ్లిపోయాడట. షూటింగ్ జరుగుతుండగా కూడా చాలా అనుమానాలని నిర్మాతలు, హీరో వ్యక్తం చేసినప్పటికీ శ్రీను వైట్ల మాత్రం మోనార్క్లా వ్యవహరించాడట.
చివరిగా అందరూ భయపడ్డట్టుగానే ద్వితీయార్థం హారిబుల్గా తయారై సినిమా డిజాస్టర్ అయింది. దీంతో హీరోకి ఫ్లాప్, నిర్మాతలకి లాస్ వచ్చింది నిజమే కానీ, పూర్తిగా నష్టపోయింది మాత్రం శ్రీను వైట్లనే. ఈ సినిమాతో తన ఇమేజ్కి జరిగిన డ్యామేజ్ని అతను మళ్లీ రిపేర్ చేసుకోగలడో లేదో మరి.