మీడియాకు జగన్ చాయ్ బిస్కట్

వైకాపా నేత వైఎస్ జగన్ గురించి చాలా చాలా వింటూ వుంటారు. వేల కోట్లు, భారీ భవంతులు, ఇంకా ఇంకా. అయితే లక్షాధికారులైనా లవణామన్నామే గానీ బంగారు కణికెలు తినలేరు అన్నది పెద్దల మాట. జగన్ కూడా అంతే. మినహాయింపు ఏమీ లేదు.

వైఎస్ జగన్ చాలా పరిమితంగా ఆహారం తీసుకుంటాడట. అది కూడా ఉడికించిన కూరలు, సలాడ్ లు లాంటివి. తన ఎదురుగా ఎవరన్నా ఎక్కువ తింటున్నా, ఏమిటా తిండి అని అనేస్తాడు కూడా, అన్నది సన్నిహితుల మాట.

కట్ చేస్తే, అలాంటి వైఎస్ జగన్ నిన్నటికి నిన్న తెలుగు మీడియా సంస్థల బాస్ లను స్వయంగా సంభాషించడానికి పిలిచాడు.

మీడియా సంస్థల బాస్ లు అంటే చిన్నవాళ్లు కాదు కదా. మహా మహా పెద్ద వాళ్లే. వెళ్లిన వాళ్లందరినీ నేరుగా డయినింగ్ హాలులోకే తీసుకెళ్లారట. అక్కడే మీటింగ్ ముచ్చట్లు. మరి అలా పెద్ద వాళ్లను పిలిచినందుకు, అది కూడా సరిగ్గా మధ్యాహ్నం 11 గంటల టైమ్ లో అయినందుకు మాంచి బఫే ఏర్పాటు చేసారేమో అనుకుంటే, అదేమీ కాదట. జస్ట్ చాయ్, బిస్కట్లు మాత్రమే ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.

నిజానికి మరెవరైనా అయితే, ఇలా మీడియా పెద్దలను పిలిచినందుకు, కాస్త మంచి చేసుకునేందుకైనా మాంచి వంటకాలు వండించి, ఆంధ్ర స్పెషల్, తెలంగాణ స్పెషల్ అంటూ భోజనం వడ్డిస్తారు. కావాలంటే ఈ విషయంలో చంద్రబాబుగారిని చూసి జగన్ నేర్చుకోవాలి.

కానీ జగన్ తన పార్టీ వాళ్లకు రెగ్యులర్ గా టీలు, కాఫీలు ఇవ్వడు అని ఇన్ సైడ్ వర్గాలు అంటుంటాయి. అందువల్ల మీడియా పెద్దలకు చాయ్ బిస్కెట్ రెండూ ఇచ్చాడంటే, ఎక్కువే ఆతిధ్యం ఇచ్చాడని మరి కొన్ని వర్గాలు అంటున్నాయిు. జగన్ దృష్టిలో ఇది చాలా ఎక్కువ ఆతిథ్యం అయి వుంటుందని చమత్కరిస్తున్నారు.