రెండు పాటలే రంగస్థలం బ్యాలెన్స్

సుకుమార్-రామ్ చరణ్ కాంబో సినిమా రంగస్థలం షూటింగ్ మొత్తానికి పూర్తి కావస్తోంది. ఒకటి రెండు రోజులు ప్యాచ్ వర్క్ మినహా టాకీ మొత్తం పూర్తయింది.

ఇవ్వాళ రేపు, గోపన్నపల్లి, ఇంకా ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు షాట్ లు తీసేస్తే, టాకీ పూర్తయిపోతుంది. జనవరి రెండో వారంలో ఈస్ట్ గోదావరిలో రెండు పాటలు చిత్రీకరించడంతో సినిమా మొత్తం పూర్తవుతుంది.

రెండు పాటలు గోదావరి జిల్లాల నేపథ్యంలో చిత్రీకరిస్తారు. ఇక అక్కడి నుంచి రెండు నెలల పాటు లీజర్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడమే. రంగస్థలం సినిమాను దాదాపు ఏడాది కాలంగా దర్శకుడు సుకుమార్ అపురూపంగా చెక్కుతున్నారు.

మైత్రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రామ్ చరణ్ సరసన సమంత నటిస్తున్న ఈ సినిమా కోసం జూబ్లీ హిల్స్ లోని కొండపై ఓ గ్రామం సెట్ నే నిర్మించారు. ఈ సెట్ అంతా 1980దశాబ్దపు వాతావరణంతో వుంటుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందీ సినిమా.