‘వీరగ్రంధం’ వీరలెవల్లో నచ్చేసినట్టుంది.!

‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ పేరుతో కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం విదితమే. ఇది పూర్తిగా లక్ష్మీపార్వతి కథ. స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణిగానే అందరికీ సుపరిచితురాలైన లక్ష్మీపార్వతి అసలు ఎన్టీయార్ తో వివాహం జరగకముందు లక్ష్మీపార్వతి ఎవరు.? ఆమె కథేంటి.? అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ వెలుగుచూడగానే, ఉలిక్కిపడ్డారు లక్ష్మీపార్వతి. ‘నా అనుమతి లేకుండా సినిమా ఎలా తీస్తారు.?’ అంటూ గుస్సా అయ్యారామె.

ఇంతకీ, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి వెనకాల ఎవరున్నారు.? ఈ సినిమా ఇంత అనూహ్యంగా ఎలా వార్తల్లోకెక్కింది.? అంటే, ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం తెలియాల్సి వుంది. వాణి విశ్వనాథ్‌ని సంప్రదిస్తున్నామని గతంలోనే కేతిరెడ్డి చెప్పారు. కాగా, ఈ సినిమా కథ తన దృష్టికి వచ్చిందని వాణి విశ్వనాథ్‌ తాజాగా ప్రకటించడం గమనార్హం. సినిమా కథ కూడా ఆమెకు విపరీతంగా నచ్చేసిందన్నది ఇన్ సైడ్ సోర్సెస్ కథనం. దాంతో, ఆమె ఈ సినిమాలో నటించడానికీ సిద్ధంగానే వుందట.

వాణి విశ్వనాథ్‌ అంటే ఒకప్పుడు గ్లామరస్‌ హీరోయిన్‌. లేడీ పోలీస్‌గానూ కన్పించిందామె. గత కొన్నాళ్ళుగా వెండితెరకు దూరంగా వుంటోన్న వాణి విశ్వనాథ్‌, మొన్నీమధ్యనే ఓ సినిమాలో నటించిందండోయ్‌. సినిమాల సంగతి పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది వాణి విశ్వనాథ్‌. చిత్తూరు జిల్లా నగిరి నుంచి 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటోందామె.!

టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్న వాణి విశ్వనాథ్‌, టీడీపీకి బద్ధ విరోధి అయిన లక్ష్మీపార్వతి ‘నేపథ్యం’తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించడమంటే, ఈ సినిమా వెనకాల వున్నది టీడీపీయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.!