తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ పరిణతిని తాజాగా టీడీపీ నేతలు మెచ్చుకుంటున్నారు. ఇటు ఏపీలోని సైకిల్ పార్టీ నాయకులే కాకుండా అటు తెలుగు తమ్ముళ్లు సైతం తమ నాయకుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆలస్యం అయినప్పటికీ బాబు నిర్ణయం అదిరిపోయిందని అని మాట వినిపిస్తున్నారు. ఇదంతా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సభ్యుల నియామకం గురించి.
దుర్గగుడికి ట్రస్ట్ బోర్డు నియామకంలో ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చైర్మన్ పేరు ప్రకటించకుండానే ట్రస్ట్బోర్డును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 16 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అటు సభ్యులకు ఇటు దుర్గగుడి కార్యాలయానికి పంపారు. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు సంవత్సరాలు పాటు పదవిలో ఉంటారు.
వై.గౌరంగబాబు, వి శంకర్బాబు, బి ధర్మారావు, కె సూర్యలలితాకుమారి, ఇ సాంబశివరావు, సి సాంబ సుశీల, పి.విజయశేఖర్, జి.పద్మశేఖరరావు, వి పాపా, సి లక్ష్మీనరసింహారావు, రంగ ప్రసాద్, ఇ పెంచలయ్య, ఇ దుర్గా ప్రసాద్, తదితరులు ఉన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వైదిక కమిటీ సభ్యునిగా ఉన్న లింగంబొట్ల దుర్గా ప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించారు.
తెలంగాణకు చెందిన రామ్నాథం, పి.రాజాలకు ఈసారి కమిటీలో సభ్యులుగా అవకాశం లభించింది. కాగా, ఏపీలో తాత్కాలిక రాజధానికి చెందిన ప్రముఖ దేవాలయంలో తెలంగాణ వారికి అవకాశం కల్పించడం మంచి సందేశం పంపించినట్లు అవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.