సాయిధరమ్ తేజ్ కు ప్రస్తుతం కొద్దిగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. కర్టసీ కోసం నక్షత్రం సినిమాలో ఓ పాత్ర చేయడానికి ఒప్పుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు ధరమ్ తేజ్. అయితే, ఈ సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం కావడం ఈ మెగా హీరోను కలవరపెడుతోంది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ, అదే రోజున ‘పైసా వసూల్’ రానుండటంతో అక్టోబర్ 1కి వెళ్లినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుంది ధరమ్ తేజ్ పరిస్థితి. అసలే లేట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కాబోతున్నట్లు వినికిడి. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు అవుట్ పుట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారట. దీంతో, ఆ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అవసరమైన చోట్ల దిల్ రాజు రీ షూట్లు చెప్పే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో ధరమ్ తేజ్ భారీగా హోప్స్ పెట్టుకున్న జవాన్ విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ టాక్. ఈ వార్త మెగా అభిమానులకి నిరాశ కలిగించినా, జవాన్ కోసం వెయిట్ చేయక తప్పదు మరి.