మహేష్, ప్రభాస్‌లతో సినిమాలు చేస్తాడట

టాలీవుడ్లో జయంత్ సి.పరాన్జీ అనే ఓ డైరెక్టర్ ఉన్న సంగతే జనాలు మరిచిపోయారు. కెరీర్ ఆరంభంలో ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఆ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు తీయలేక  బాగా వెనుకబడిపోయాడు.

పూర్తిగా ఫామ్ కోల్పోయాక కూడా ఆయన్ని నమ్మి బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ చేశాడు, పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ చేశాడు. కానీ ఆ సినిమాలు జయంత్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఐతే ఇప్పుడు ఆంధప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘జయదేవ్’ అనే సినిమా తీస్తున్నాడు జయంత్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను మహేష్ బాబు, ప్రభాస్‌లతో సినిమాలు తీసే ప్రణాళికల్లో ఉన్నట్లు చెప్పడం విశేషం.

‘‘మహేష్ బాబుతో ‘టక్కరిదొంగ’ తీశాను. ఆ సినిమా అనుకున్నట్లుగా ఆడలేదు. దాని కోసం మహేష్ ఏడాదిన్నర పాటు కష్టపడ్డాడు. కానీ సినిమా అనుకున్నట్లుగా ఆడకపోయేసరికి ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నా. మహేష్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. మహేష్‌ లవ్‌స్టోరీ చేద్దామన్నాడు. నేను వేరే తరహా సినిమా అంటున్నాను. ఇంకా స్క్రిప్ట్‌ ఫైనల్‌ అవలేదు. అన్నీ సెట్‌ అయ్యాక ఒక మంచి చిత్రం చేస్తాను. అలాగే నేను హీరోగా పరిచయం చేసిన ప్రభాస్‌తో కూడా మాట్లాడుతుంటాను. ‘ఈశ్వర్‌’ టైంలో ప్రభాస్‌ ఎలా వున్నాడో.. ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏం మారలేదు. గతంలో రెండు మూడు కథలు వినిపించాను. డేట్ల సమస్య వల్ల సెట్టవ్వలేదు. తప్పకుండా ప్రభాస్‌తో కూడా ఓ సినిమా చేస్తాను’’ అన్నారు జయంత్. ఐతే పాత పరిచయం వల్ల జయంత్‌తో మహేష్, ప్రభాస్ టచ్‌లో ఉంటే ఉండొచ్చు కానీ.. ఇప్పుడు వాళ్లున్న స్థాయికి, జయంత్ ఉన్న రేంజికి ఆయనతో సినిమాల చేస్తారంటే నమ్మగలమా?