జాన్వీ కపూర్ పై మళ్లీ తెలుగు జనాల విమర్శలు

శ్రీదేవి ని తెలుగు ప్రేక్షకులు దేవత మాదిరిగా ఆదరించారు.. అభిమానించారు. ఆమె మృతి చెందిన సమయంలో తెలుగు అభిమానుల గుండెలు పలిగాయి. ఆమె నటించిన సినిమాలు ఇప్పటికి కూడా అపురూపంగా తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా తెలుగు ప్రేక్షకులు శ్రీదేవి ని అభిమానిస్తున్నారు. అంతటి అభిమానం ను శ్రీదేవి పై కలిగి ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఆమె వారసురాలిని తెలుగు సినిమా లో చూడాలనే కోరిక బలంగా ఉంది.

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టింది. కాని శ్రీదేవి తన కూతురు మొదటి సినిమాను వెండి తెరపై చూడలేక పోయారు. శ్రీదేవి బతికి ఉంటే ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ను తెలుగు సినిమా ల్లో నటింపజేసే వారు అనేది అభిమానుల టాక్. సౌత్ లో శ్రీదేవికి ఏ స్థాయి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లి అభిమానులను సంతోషపెట్టాల్సిన బాధ్యత జాన్వీ కపూర్ పై ఉంది.

కాని జాన్వీ కపూర్ మాత్రం కేవలం బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. సరే అక్కడ అయినా కమర్షియల్ గా బంపర్ హిట్ లు ఏమైనా కొట్టిందా అంటే అది ఏమీ లేదు. ఇప్పటి వరకు హిందీ లో జాన్వీ కపూర్ సక్సెస్ దక్కించుకోలేక పోయింది. అక్కడ కమర్షియల్ బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో సౌత్ నుండి అంది వచ్చిన ఆఫర్లను జాన్వీ కపూర్ కాదంటున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.

తండ్రి బోనీ కపూర్ నుండి పలువురు ఫిల్మ్ మేకర్స్ జాన్వీ కపూర్ ను ఒప్పించే ప్రయత్నాలు చేసినా కూడా తెలుగు సినిమాను మాత్రం కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల్లో ఈమెను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని గత రెండు మూడు సంవత్సరాలుగా ఈమె ప్రతి సౌత్ సినిమాకు కూడా నో చెబుతూనే వస్తుందట.

తాజాగా రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కన్ఫర్మ్ అయిన సినిమా కోసం జాన్వీ కపూర్ ను దించే ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్ లో తనకు ఉన్న లీడ్స్ ద్వారా చిత్ర దర్శకుడు జాన్వీ కపూర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించాడట. కాని ఇప్పటి వరకు ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. కనీసం స్క్రిప్ట్ వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సౌత్ సినిమా పరిశ్రమను ముఖ్యంగా తెలుగు సినిమాలను జాన్వీ కపూర్ అవమానించినట్లగా వ్యవహరిస్తుంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పలువురు తెలుగు సినిమాల్లో నటించారు.. నటిస్తున్నారు. ఇటీవల ఆలియా నటించింది.. ప్రస్తుతం దీపికా పదుకునే నటిస్తుంది. అయినా కూడా జాన్వీ కపూర్ ఎందుకు తెలుగు సినిమాకు ఓకే చెప్పడం లేదంటూ కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు.