బాహుబలి-2 సినిమాకు ఎదురెళ్లడానికి బాలీవుడ్ సినిమాల నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదలవుతుంటే ముందు వెనుక రెండేసి వారాలు హిందీలో భారీ చిత్రాలేవీ షెడ్యూల్ కాలేదు. ఐతే తెలుగులో మాత్రం బాహుబలి వచ్చిన రెండు వారాలకే ఒక మీడియం రేంజి సినిమా బాక్సాఫీస్ రేసుకు రెడీ అయిపోతోంది. ఆ చిత్రం మరేదో కాదు.. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘కేశవ’.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘కేశవ’ చిత్రాన్ని మే రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఐతే అవి జస్ట్ రూమర్లే అనుకున్నారంతా. ఎందుకంటే ‘బాహుబలిః ది కంక్లూజన్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రం కనీసం నెల రోజులు హవా సాగిస్తుందని భావిస్తున్నారు. కాబట్టి ఆ సినిమా వచ్చిన తర్వాత రెండు మూడు వారాల్లో వచ్చే సినిమాలకు చాలా కష్టమని అనుకుంటున్నారు.
కానీ ‘కేశవ’ టీం ఏం భయపడకుండా మే 12న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేసింది. ‘కేశవ’ వచ్చిన వారానికి బన్నీ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ రాబోతుండటం విశేషం. అంటే కేశవకు ముందు వెనుక మోతే అన్నమాట. ఆల్రెడీ ‘కేశవ షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాణంలోకి వచ్చిన అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిఖిల్-సుధీర్ కాంబినేషన్లో ఇంతకుముందు ‘స్వామిరారా’ లాంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.