ఖైదీ నంబర్ 150 ఈవెంట్కి పవన్కళ్యాణ్ గైర్హాజరు అయినప్పటికీ కాటమరాయుడు వేడుకకి చిరంజీవి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం ఆడియో వేడుకకి చిరంజీవి వచ్చారు కనుక ఈసారి కూడా అన్నయ్యకి పిలుపు వెళుతుందని అనుకుంటున్నారు. కానీ ఈసారి చిరుకి కానీ, ఇతర మెగా హీరోలకి కానీ ఇన్విటేషన్లు వెళ్లలేదట.
కేవలం కాటమరాయుడు బృందం మాత్రమే పాల్గొంటుందట. పవన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాటమరాయుడు ఫంక్షన్లో చిన్న సెలబ్రేషన్ వుంటుందట. ఇందుకోసమైనా చిరంజీవిని పిలుస్తారని ఫాన్స్ భావించారు. కానీ ఈసారి అన్నయ్యని పిలవడానికి పవన్ ఎలాంటి అటెంప్ట్ చేసినట్టు లేడు. ఇరవయ్యేళ్ల వేడుకని ఆర్భాటంగా చేయవద్దని, సింపుల్గా చేసేయమని పవన్ చెప్పాడట.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ప్రాంగణంలో కాకుండా శిల్పకళావేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు. కనుక వేల కొద్దీ అభిమానుల మధ్య ఆడంబరంగా ఈ ఈవెంట్ జరగబోవడం లేదు. ఖైదీ నంబర్ 150కి ముందు గుంటూరులో చేసిన వేడుక ఆ చిత్రానికి హైప్ తీసుకొచ్చింది. మరి ఈ తూ తూ మంత్రం ఈవెంట్ వల్ల కాటమరాయుడుకి కలిసొచ్చేది ఏమైనా వుంటుందా లేదా అనేది చూడాలి.