జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్కల్యాణ్ మరోమారు ప్రజా సమస్యలపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంపై పవన్ తన ట్విట్టర్ అకౌంట్లో వివరాలు వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారిని పరామర్శించనున్నట్లు పవన్ తెలిపారు. అనంతరం ఆయన విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా పవర్ స్టార్కు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
పర్యటనకు ముందు ఉద్దానంలో ఉన్న పరిస్థితులను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ వివరించారు. ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో అనేకమంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా ఇలా అకాలమరణం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం లక్షల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని, ప్రభుత్వం వీరి సమస్యను సరిగా గుర్తించడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బృందం అక్కడి వెళ్లి వారి సమస్యలపై డాక్యుమెంటరీ తయారు చేసిందని తెలిపిన పవన్ తన బృందం రూపొందించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసి వారి బాధ, సమస్య తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు. ఉద్దానం వెళ్లి నిస్సహాయులుగా ఉన్న బాధితులతో మాట్లాడనున్నట్టు ప్రకటించి అక్కడికి బయల్దేరారు.