మనం.. సోగ్గాడే చిన్ని నాయనా.. ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఊపుమీద కనిపించిన నాగార్జునకు ఈ ఏడాది ఆరంభంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ‘ఓం నమో వేంకటేశాయ’ రూపంలో ఆయనకు చేదు అనుభవం మిగిలింది. మంచి టాక్ వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడం నాగార్జునను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఐతే ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడి చకచకా తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేశాడు నాగ్. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో నాగ్ ప్రధాన పాత్రలో మొదలైన ‘రాజు గారి గది-2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ముగింపు దిశగా దూసుకెళ్తోంది.
ఈ నెలలోనే ‘రాజుగారి గది’ సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి జులై తొలి వారంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయాలని భావిస్తున్నారు. జులై 7 ప్రస్తుతానికి రిలీజ్ డేట్ గా అనుకుంటున్నట్లు సమాచారం. ఆ రోజుకు ఆల్రెడీ బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో పాటు నాని మూవీ ‘నిన్ను కోరి’ కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి.
అయినప్పటికీ నాగ్ రేసులో నిలవాలని భావిస్తున్నాడు. ‘రాజు గారి గది-2’ను జులై 7కే ఫిక్స్ చేస్తే దాని వల్ల మిగతా సినిమాలకే ఇబ్బంది. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాగ్ ఇందులో మోడర్న్ మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.