రామ్ చ‌ర‌ణ్ ఖైదీ నెంబ‌ర్ 150 చూడ‌ట్లేదు

దాదాపు ద‌శాబ్దం విరామం త‌ర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న‌ రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. సామాన్య ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రెటీలు కూడా చిరు సినిమా కోసం ఆస‌క్తితో ఉన్నారు. వీలుంటే ప్రివ్యూలు చూడాల‌ని తపిస్తున్నారు. ఐతే చిరు త‌న‌యుడు.. ‘ఖైదీ నెంబ‌ర్ 150’కి నిర్మాత కూడా అయిన రామ్ చ‌ర‌ణ్ మాత్రం ముందే ఈ సినిమాను చూడాల‌నుకోవ‌ట్లేదు. అభిమానుల‌తో క‌లిసి రిలీజ్ రోజు థియేట‌ర్ల‌లోనే ఈ సినిమా చూస్తాన‌ని అంటున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.

నిర్మాత‌గా తాను సినిమాలో అక్కడక్కడా కొన్ని బిట్స్‌ చూశానని.. ఐతే పూర్తి సినిమా మాత్రం థియేటర్లలో అభిమానులతో పాటే చూస్తానని చ‌ర‌ణ్ స్ప‌ష్టం చేశాడు. విడుదలకు ముందే ప్రివ్యూ చూసే అవకాశం ఉన్నా.. తాను థియేటర్లలోనే చూడాలనుకుంటున్నట్లు చరణ్ తెలిపాడు. చిరంజీవికి తానూ ఓ పెద్ద అభిమానినని.. ఆయన డ్యాన్సులు , ఫైట్లు అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య  చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నానని చరణ్ ఈ సందర్భంగా అన్నాడు. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఖైదీ నెంబ‌ర్ 150’ ఈ నెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. 10న ఓవ‌ర్సీస్‌లో ప్రిమియ‌ర్ల‌కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శ‌నివార‌మే ‘ఖైదీ నెంబ‌ర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.