దొంగ బాబాను క‌డిగిపారేసిన బాలీవుడ్ భామ‌

త‌న‌ను అభిమానిస్తున్నారు.. ఆరాధిస్తున్నార‌న్న కార‌ణాల‌తో రెండు రాష్ట్రాల్ని అత‌లాకుత‌లం చేయ‌టంతో పాటు.. మ‌రో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను సృష్టించి డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ లాంటి దొంగ బాబాల‌పై బాలీవుడ్ భామ ట్వింకిల్ ఖ‌న్నా ఓ రేంజ్లో విరుచుకుప‌డ్డారు. దొంగ బాబాల్ని క‌డిగిపారేసిన ఆమె.. ఇలాంటి వారిని గుడ్డిగా ఫాలో అవుతున్న జ‌నాల‌దే అస‌లు త‌ప్పంతా అంటూ ఫైర్ అయ్యారు.

దొంగ బాబాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆమె.. డేరా ర‌చ్చ ఉదంతం ఆమెను చాలా తీవ్రంగా డిస్ట్ర‌బ్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఒక ఆంగ్ల ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో ఆమె త‌న ఆగ్రహాన్ని వ్య‌క్తం చేశారు. తీవ్ర ప‌ద‌జాలంతో ఉతికి ఆరేసిన ట్వింకిల్ ఖ‌న్నా వ్యాఖ్య‌లు చూస్తే..

న‌న్ను నిజంగా బాధ పెట్టే అంశం ఏమిటంటే.. మ‌న పుర్రెలు తెగ‌కోసి మ‌న మెద‌ళ్ల‌ను వాళ్ల‌కు ఎలా ఒక ప‌ళ్లెంలో పెట్టి అందిస్తున్నాం? అంటూ సందేహాన్ని వ్య‌క్తం చేసిన ఆమె.. మ‌న‌వేమైనా కోతి బుర్ర‌లా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోడ్ల మీద గుంత‌ల మాదిరి బాబాల పేరిట దుర్మార్గ చేష్ట‌లు దేశంలో కామ‌న్ అయిపోయాయ‌న్నారు.

బాబాల చుట్టూ ఆవ‌రించిన కాంతి కేవ‌లం ఒక ట్రిక్ మాత్ర‌మేన‌న్న ఆమె.. ఆ విష‌యాన్ని అంద‌రూ మ‌ర్చిపోతున్నార‌న్నారు.  పొద్దు తిరుగుడు పువ్వుల్లా బాబాల చుట్టూ తిరుగుతున్నామ‌ని.. ఇదే అద‌నుగా దొంగ బాబాలు బ‌య‌లుదేరుతున్న‌ట్లుగా ట్విట్ట‌ర్ లోనూ ట్వీట్ చేసి క‌డిగిపారేసే ప్ర‌య‌త్నం చేశారు. రెండు రాష్ట్రాల్లో ర‌చ్చ ర‌చ్చ చేసిన ఒక ఉదంతంపై ఒక బాలీవుడ్ ప్ర‌ముఖురాలు ఈ రేంజ్ లో ఫైర్ కావ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.