అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా

‘దేవదాసు’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత అగ్రనటిగా రాణించింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్, పపవన్‌ కల్యాణ్‌, రవి తేజ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత చేతి నిండా సినిమాలతో తెలుగుతో తమిళంలోను ఫుల్‌ బిజీ ఆయిపోయిన ఇలియానాకు అదే సమయంలో బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమాకే రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టెసింది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’ సినిమాలో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత అక్కడ ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

దీంతో ఆ మధ్య ఇలియానా పూర్తిగా సినిమాలు తగ్గించి ప్రముఖ అస్ట్రేలియా ఫొటో గ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అతడికి బ్రేకప్‌ చెప్పిన ఇలియానా మళ్లీ సినిమాలపై మొగ్గు చూపింది. ఈ క్రమంలో రవితేజతో ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇటీవల బాలీవుడ్‌లో అభిషేక్‌ బచ్చన్‌తో బిగ్‌ బుల్‌లో నటించింది. అయితే గతంతో పోలిస్తే ఇలియానాకు ఇప్పుడు సినిమ అవకాశాలు అంతగా లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర​స్తుతం హిందీలో రణ్‌దీప్‌ హుడాతో ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ మూవీలో నటిస్తోన్న ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆమె తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. ‘నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. ఏది పడితే అది చేయాలని నేను అనుకోవడం లేదు. కథలో పాత్రకి ప్రాధాన్యం ఉండాలి. నా దగ్గరకు వచ్చిన కథలని ఆచితూచి ఎంపిక చేస్తున్నాను. రొటీన్‌కి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను. అంతేకాక.. పూర్తిస్థాయిలో యాక్షన్ చిత్రంలో నటించాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, తన ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయలేకపోతున్నట్లు తెలిపింది. కాబట్టి అందులో ఎలాంటి ట్వీట్లు వచ్చినా పట్టించుకోవద్దని ఇలియానా తన ఫ్యాన్స్‌కు సందేశం ఇచ్చింది.