అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయండి- సీఎస్‌

హైదరాబాద్‌: రాబోయే బడ్జెట్‌ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమావేశాలకు సంబంధించి వచ్చిన ప్రశ్నలతో పాటు గత సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ శాఖల అధికారులు అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలి అన్నారు. ఇక పెండింగ్‌ ఆడిట్‌ పేరాలకు సంబంధించి సమాధానాలను పీఏసీకి సమర్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నోట్‌ ఆన్‌ డిమాండ్‌, ఔట్‌ కమ్‌బడ్జెట్‌ తయారీలో సమగ్ర వివరాలు ఉండాలన్నారు.
వివిధ శాఖలు తమకు సంబంధించి వివరాల బ్రీఫ్‌ ప్రొఫైల్‌ను వెంటనే సమర్పించాలన్నారు. శనివారం బిఆర్‌కె భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నూతన రాష్ట్రపతి ఉత్వర్వుల అమలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలు, జవాబులు, ఆడిట్‌పేరాలు, బడ్జెట్‌సన్నద్ధత పై సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అమలుకు సంబంధించి వివిధ శాఖలు తమ వివరాలను మార్చి 4 నాటికి జీఏడీకి సమర్పించాలని ఆదేశించారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ నూతన రాష్ట్రపతి చట్టం అమలుకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటికే సమర్పించిన నివేదికలపై జీఏడీ, ఆర్ధికశాఖ ద్వారా అబ్జర్వేషన్లను పంపామని, శాఖలు తమ పోస్టుల వివరాలను నిబంధనలకనుగుణంగా మార్చి 4 నాటికి సమర్పించాలన్నారు బిజినెస్‌రూల్‌ ప్రకారం తదుపరి చ ర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌లు రాజేశ్వర్‌ తివారీ, శాంతకుమారి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణరావు, రజత్‌కుమార్‌, సునీల్‌శర్మ, శశాంక్‌గోయల్‌, జయేష్‌రంజన్‌, వికాస్‌రాజ్‌రవిగుప్త, అడిషనల్‌ డీజీ జితేందర్‌, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.