ఉగాది శ్రవణంః శ్రీదేవిని చంపేశారు!!!

మన జనాలకు భక్తి ఎక్కువే.. అలాగే నమ్మకాలు కూడా ఎక్కువే. మూఢ నమ్మకాలు కానంత వరకూ వేటినైనా యాక్సెప్ట్ చేయచ్చని చాలామంది నమ్ముతారు. ఉగాది పండుగ సందర్భంగా.. పలువు పంచాంగ శ్రవణం వినిపించడం.. వాటిని విని తరించడం జనాలకు అలవాటు. టీవీ ఛానళ్లు కూడా పలువురు పండితులను(తాము నమ్మిన మెచ్చిన వారిని మాత్రమే) తీసుకొచ్చి గంటలకొద్దీ పంచాంగాలను వినిపిస్తుంటారు.

శ్రీకాళహస్తి ఆలయ ఆస్థాన జ్యోతిష్కులు అయిన మురులు రామలింగేశ్వర వరప్రసాద్ కు మంచి గుర్తింపు ఉంది. ఉగాది సందర్భంగా ఈయన చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. రీసెంట్ గా దుబాయ్ లోని ఓ హోటల్ లో మరణించిన ఈమెది సహజ మరణం కాదని తేల్చేశారు ఈ జ్యోతిష్కుడు. ఆమెను సన్నిహితులే హత్య చేశారని కూడా తేల్చేశారు. మరణించిన వ్యక్తులను కూడా పంచాంగంలోకి పట్టుకొచ్చేసి సెన్సేషన్ కు సెంటర్ పాయింట్ అయిపోయారు.

2019 ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలిచేస్తుందని అధికారం చేపట్టడం ఖాయమని చెప్పిన మురులు రామలింగేశ్వర వర ప్రసాద్.. బీజేపీకి గడ్డుకాలం నడవనుందని చెప్పారు. గుజరాత్.. మహరాష్ట్ర.. రాజస్థాన్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో భాజపాకు గతంతో పోల్చితే సగం సీట్లే వస్తాయని అన్నారు. ఏపీ తెలంగాణల్లో బీజేపికి ఒక్క సీట్ గెలవడం కూడా కష్టమేనని తేల్చేసిన ఈ జ్యోతిష్కులు.. రజినీకాంత్ రాజకీయాల్లో రాణిస్తారని చెప్పుకొచ్చారు.

వినేవాళ్లు తెలుగు జనాలు అయితే.. అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అనే సంగతి రీసెంట్ బై పోల్స్ లో తెలిసిపోయింది. తమిళనాడులో రజినీ క్రేజ్ కూడా అందరికీ తెలుసు. ఇక తెలంగాణలో ఎదురులేని పార్టీగా టీఆర్ఎస్ ప్రభ కొనసాగుతోంది. వాటినే తిప్పి తిప్పి తన ట్యాలెంట్ కింద చెప్పారన్నది పలువురి వాదన. వీటికి తోడు శ్రీదేవి మృతిపై అభిమానుల్లో ఉన్న కొన్ని అనుమానాలు ఉండగా.. వాటిని ఏ ఆధారాలు లేకుండా కన్ఫాం చేసేస్తూ.. జనాల ఫీలింగ్స్ తో ఇలా బ్యాటింగ్ చేయడం.. పండితులకు తగదని పలువురు హితవు పలుకుతున్నారు.