కమ్ముల ‘లీడర్’.. ట్రెండ్ సెట్ చేసేనా..?

హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ‘లీడర్’ మూవీ.. 15 ఏళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఫస్ట్ సినిమాలో సీఎం అర్జున్ ప్రసాద్ గా రానా తనదైన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సినిమాతో రానా ట్రెండ్ కూడా సెట్ చేశారు.

ఒక యంగ్ హీరో పొలిటికల్ జానర్ ను టచ్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో అదే ఫస్ట్ టైమ్. డెబ్యూ సినిమాతోనే కమర్షియల్ హిట్ కూడా అందుకున్నారు రానా. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. మే9వ తేదీన లీడర్ సినిమా రీ రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్ లో ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.

అక్కడికి నాలుగు రోజుల ముందు లీడర్ రీ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు. ఇక కొన్ని నెలలుగా టాలీవుడ్ రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. అనేక చిత్రాలు వరుసగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అప్పట్లో నార్మల్ హిట్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో లీడర్ ఒక స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసే ఎలాంటి అంశాలు ఆ చిత్రంలో ఉండవు.

తొలి ప్రేమ, ఆరెంజ్ వంటి లవ్ జోనర్ సినిమా కూడా కాదు. దీంతో ఇప్పుడు లీడర్ మూవీ రీ రిలీజ్ పై అంతా ఆసక్తి నెలకొంది. పొలిటికల్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి పొలిటికల్ హీట్ ఉన్న టైమ్ లో సూపర్ వసూళ్లు రాబడితే ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. అంతే కాకుండా లవ్, మాస్ జోనర్ సినిమాలే కాకుండా సోషల్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రాలను కూడా రీ రిలీజ్ చేస్తారు ఆయా మూవీల మేకర్స్.

లీడర్ ను సినీ ప్రియులు ఆదిరించడంపైనే ఆ జోనర్ లో తెరకెక్కిన మిగతా సినిమాల రీ రిలీజ్ విషయం ఆధారపడి ఉంటుంది. మరోవైపు, ఇప్పటికే తనకు లీడర్ -2 తీయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శేఖర్ కమ్ముల. కానీ టైం సరిపోవడం లేదని చెప్పారు. మరి లీడర్ రీ రిలీజ్ రిజల్ట్.. డైరెక్టర్ శేఖర్ కమ్ములకు సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనను మరింత వేగవంతం చేస్తుందో లేదో చూడాలి.