కరోనా ఎఫెక్ట్: నితిన్ ప్లాన్ కూడా మారింది

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ భయంకర వైరస్ అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చేయడంతో జనాలు బయటికి వెళ్లాలంటేనే జడుసుకుంటున్నారు. దీని కారణంగా కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెల బోతున్నాయి. కేరళలో అయితే ఏకంగా థియేటర్లకు తాళాలు వేసిన సంగతి తెలిసిందే. మన దగ్గర మరీ పరిస్థితి అంత దారుణంగా లేకపోయింది. కరోనా ఎఫెక్ట్ మాత్రం టాలీవుడ్‌పై బాగానే పడింది.

‘ఫర్ ఎవర్ సింగిల్’ అంటూ భీష్మ తీసిన వెంటనే పెళ్లికి రెఢీ అయిన నితిన్‌కు కూడా కరోనా సెగ తగిలింది. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ మనోడు దుబాయ్‌లో గ్రాండ్‌గా‘డెస్టినేషన్ వెడ్డింగ్’ చేసుకుందామనుకున్నాడు. అయితే కరోనా సెగ కారణంగా అక్కడి దాకా వెళ్లలేక ఇక్కడే హైదరాబాద్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నితిన్. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ సినిమా షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో కంగారుపడి కేరళలో కానిచ్చేద్దామని ఫిక్స్ అయ్యారట. అలాగే సమ్మర్‌లో హాయిగా ఫారిన్‌కి వెళ్లి సేద తీరుదామని ప్లాన్ వేసుకున్న హీరోలు, హీరోయిన్లు… కరోనా ప్రభావంతో ఆ ప్లాన్స్ అన్ని పక్కనబెట్టేసి ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినట్టు టాక్.

కరోనా ప్రభావం ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియక సినీ జనాలు తెగ కంగారు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, సమ్మర్‌లో విడుదల చేయాలని షెడ్యూల్ చేసుకున్న సినిమాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇంకెంత కాలం ఉంటుందో చూడాలి మరి.