థియటర్ల మూత వద్దంటున్న హీరో తండ్రి

ఓ పది రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తే బెటర్ అన్న ఆలోచన ఒకటి బయల్దేరింది. దీనిపై తెరవెనుక డిస్కషన్లు సాగుతున్నాయి. సమావేశాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ రెడ్డి దీన్ని అపోజ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన కుమారుడు నితిన్ నటించిన భీష్మ సినిమా ఇంకా థియేటర్లలో వుండడం, ఇంతోఅంతో షేర్ సంపాదిస్తూ వుండడమే అందుకు కారణం అని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమాలు లేవు. వున్నవాటిలో భీష్మనే కాస్త ఫ్యామిలీ సినిమా. కాలక్షేపానికి పనికి వచ్చే సినిమా. అందువల్ల మరో పది రోజుల పాటు ఇంతో అంతో షేర్ అయితే వస్తుంది. డెఫిసిట్ అయితే డెఫినిట్ గా రాదు. అందుకే సుధాకర రెడ్డి థియేటర్ల రద్దు వద్దు అని అంటున్నారని టాక్.

థియేటర్ల రద్దు వుంటే తమ సినిమాల పరిస్థితి ఏమిటి? అని ఈ నెల 25న విడుదల కాబోయే సినిమాల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ థియేటర్లు పదిరోజులు మూతపడితే, సినిమాల విడుదలను ప్రోటోకాల్ ప్రకారం వారంవారం వెనక్కు జరుపుతూ వెళ్లాలని కోరుతున్నారు. అలా కాకుండా ఏప్రియల్ లో విడుదల ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు వాటి డేట్ లకు అవి వచ్చి, తమ సినిమాలను మాత్రం వదిలేయడం సరికాదంటున్నారు.

నిజానికి ఈ నెల 25న విడుదల కావాల్సిన వి సినిమా వచ్చేనెల మూడోవారానికి వెళ్లిపోయింది. ఏప్రియల్ రెండు వరకు పెద్ద సినిమాలు లేవు. అందువల్ల థియేటర్ల బంద్ పెద్ద నిర్మాతలకు సమస్య కాదు. కానీ స్లాట్ దొరికింది అని సినిమాలు ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలకే సమస్య.