ఫేక్‌ న్యూస్‌తో చంపేయొద్దు.!

బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌కి యాక్సిడెంట్‌ అయ్యిందట.. ఆ యాక్సిడెంట్‌లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయట.. ఇదీ నిన్నంతా మీడియాలో హల్‌చల్‌ చేసిన గాసిప్‌. అయితే, ఆ గాసిప్‌లో నిజం లేదని తేలిపోయిందనుకోండి.. అది వేరే విషయం. మిగతా గాసిప్స్‌ సంగతెలా వున్నా, ‘ప్రమాదాలు – మరణాలు’ వంటి విషయాల్లో గాసిప్స్‌ సెలబ్రిటీలను చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. వాటిని ఆయా సెలబ్రిటీలు లైట్‌ తీసుకోలేని పరిస్థితి.

కొన్ని సందర్భాల్లో ‘అందరికన్నా ముందు..’ అనే తొందరలో మీడియా, ఫేక్‌ న్యూస్‌ని ప్రచారంలోకి తెస్తుండడం తెల్సిన విషయమే. టాలీవుడ్‌ నటుడు మల్లికార్జునరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, చనిపోయాడని డిక్లేర్‌ చేసేసింది మీడియా. అఫ్‌కోర్స్‌, ‘ఆయన చనిపోలేదు’ అని ప్రకటన వచ్చిన ఒకటి రెండు రోజులకే మల్లికార్జునరావు తుది శ్వాస విడిచారు. మరో కమెడియన్‌, దర్శకుడు కూడా అయిన ఏవీఎస్‌ విషయంలోనూ అంతే. ‘మీడియాలో చచ్చిపోయాను, మళ్ళీ బతికాను..’ అంటూ తన మరణంపై వచ్చిన గాసిప్స్‌ని ఆవేదనతోనే ఆయన లైట్‌ తీసుకున్నారు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే కన్పిస్తాయి.

ఇక, బిగ్‌-బి అయితే తన మీద వచ్చిన గాసిప్స్‌ తననీ, తన కుటుంబాన్నీ తీవ్ర ఆవేదనకు గురిచేశాయనీ, ఇలాంటి గాసిప్స్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, మీడియాకి అవకాశం వున్నా ‘క్రాస్‌ చెక్‌’ చేసుకోకపోవడమేంటని ప్రశ్నించాడాయన. ‘అసలు ప్రమాదమే జరగనప్పుడు, గాయాలపాలయ్యే అవకాశమెక్కడుంటుంది.?’ అని బిగ్‌-బి చెప్పుకొచ్చారు. ‘సమాచార లోపం’ అయితే ఫర్లేదుగానీ, పనిగట్టుకుని జరిగే దుష్ప్రచారం మాత్రం క్షమార్హం కాదని బిగ్‌-బి అభిప్రాయపడ్డారు. ఫేక్‌ న్యూస్‌తో సెలబ్రిటీలను చంపేయొద్దని బిగ్‌-బి విజ్ఞప్తి చేశారు.


Recent Random Post: