బాలయ్య కోసం ఇద్దరు వెయిటింగ్.. ముందుగా ఎవరితో?

నటసింహా నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో `అఖండ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఆగస్ట్ 28న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. `సింహా`.. `లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన కాంబినేషన్ నుంచి రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా బాలయ్య మాత్రం వీలైనంత త్వరగా తదుపరి ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

దసరా కానుగా బాలకృష్ణ కొత్త సినిమాని ప్రకటించి..పట్టాలెక్కించాలని సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే గోపిచంద్ మలినేని స్క్రిప్ట్ రెడీ చేసి ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అనీల్ రావిపూడి వేరొక స్క్రిప్టును బాలయ్యకు వినిపించారు. అయితే ముందుగా ఎవరితో? ఈ దసరాకి ప్రారంభించేది ఏ దర్శకుడితో..! అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలన్నీ పూర్తవుతాయి. బాలయ్య ప్రయత్నాలు అవిశ్రామంగా ఉన్నాయనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా అఖండతో హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న కసితో బాలయ్య-బోయపాటి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిసింది.