రేవంత్ పై నిలువునా చీలిన తె-తెదేపా!

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. పోదలచుకున్న వాడు చల్లగానే ఉన్నాడు. కానీ ఉన్నవాళ్లే కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించబోతున్నట్లుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు రావడం విశేషం. రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొందరు, షోకాజ్ అవసరం లేదని కొందరు సీనియర్లు వాదులాడుకున్నారు.

ఈ పరిణామం ఆదివారం పార్టీ సమావేశం సందర్భంగా చోటు చేసుకుంది. రెండు రోజుల కిందటే.. ఇదే రేవంత్ ఎపిసోడ్ తగాదా కారణంగానే నాయకులు మోత్కుపల్లి, అరవింద్ కుమార్ అలిగి పార్టీ భేటీనుంచి బయటకు వెళ్లిపోవడం అందరికీ గుర్తుంటుంది. మళ్లీ జరిగిన సమావేశంలోనూ వీరే రేవంత్ పై చర్యకు పట్టుబట్టి.. నాయకుల మద్య అభిప్రాయ భేదాలు బయటపడే పరిస్థితి కల్పించారని వార్తలు వస్తున్నాయి.

రేవంత్ కు బహుశా అంతా హాయిగానే ఉండొచ్చు. ఆయన ఎంచక్కా ఢిల్లీ వెళ్లి రాహుల్ తో భేటీ అయి.. కాంగ్రెస్ లోకి వస్తే తన భవిష్యత్తు ఏమిటో మాట తీసుకుని వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితే చిత్రంగా ఉంది. రేవంత్ విషయంలో అక్కడి నాయకులు తగాదా పడే పరిస్థితి ఏర్పడుతోంది. రేవంత్ గురించి జరుగుతున్న ప్రచారం గురించి నివేదిక ఇవ్వాలంటూ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణను పురమాయించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీలక నాయకులు కొందరు ఆదివారం సాయంత్రం సమావేశం అయ్యారు. రేవంత్ గురించిన ప్రచారం- పరిణామాల గురించి చర్చించారు. నివేదిక ఇవ్వడం గురించి మాట్లాడుకున్నారు.

అయితే రేవంత్ కు పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వవాల్సిందే నంటూ మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ పట్టుపట్టారు. కానీ.. మిగతా నేతలు దీనిని వ్యతిరేకించడం విశేషం. తన మీద జరుగుతున్న ప్రచారం గురించి రేవంత్ ఇప్పటికే వివరణ ఇచ్చేశారని, కనుక షోకాజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు నాయకులు వాదించారు. రేవంత్ వివరణ సరిగా లేదంటూ, షోకాజ్ ఇవ్వాల్సిందేనని మోత్కుపల్లి పట్టుపట్టినా ఫలితం లేకుండా పోయింది. తన భవిష్యత్తు మార్గం తాను ఎంచుకుని, రేవంత్ ప్రశాంతంగానే ఉన్నారు గానీ.. ఆయన గురించి రెండు వర్గాలుగా చీలిపోయి తెలంగాణ తెలుగుదేశం లోని సీనియర్ నాయకులు తగాదా పడుతున్నారని తెలుస్తోంది.


Recent Random Post: