విశాఖలో పోలీసుల తీరు జగన్ ఫ్యాక్షన్ పాలన తలపిస్తోంది: లోకేశ్

విశాఖపట్నంలో లక్ష్మీ అపర్ణ అనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ పై పోలీసుల తీరు సోషల్ మీడియాలై వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. అపోలో ఆసుపత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె పోలీసులు దురుసుగా ప్రకవర్తించడం దారుణమన్నారు.

‘విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుందో లేదో కానీ, వైసీపీ మార్క్‌ పులివెందుల పోలీసింగ్‌తో అరాచ‌కాల‌కు అడ్డాగా మారింది’ అని లోకేశ్ విమర్శించారు. ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండ‌గా యువ‌తిపై పోలీసులు దాడి చేయ‌డం సిగ్గుచేటని ట్వీట్ చేశారు.

అయితే.. లక్ష్మీ అపర్ణపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదని ఏసీపీ హర్షిత్ చంద్ర తెలిపారు. కర్ఫ్యూ సమయంలో విధుల నుంచి ఇంటికెళ్లేందుకు అమెవద్ద అవసరమైన పత్రాలు ఉన్నా.. నిన్న అవి తీసుకురాలేదు. దీంతో పోలీసులు ఫైన్ విధించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులను నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. ఆమెను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నంలో ప్రతిఘటించింద’ని అన్నారు.