సోషల్ మీడియా ఎఫెక్ట్.. విశ్వక్ ఏమన్నారంటే

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలకు గాను తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. త్వరలో మెకానిక్ రాకీ మూవీతో దీపావళి కానుకగా రానున్నారు. అలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు విశ్వక్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసేశారు. అదే సమయంలో ఎక్స్ (ట్విట్టర్) ను తన టీమ్ వినియోగిస్తుందని చెప్పారు. అందులో ఎవరూ కూడా చింతించాల్సిన పనిలేదని తెలిపారు. ఇన్‌ స్టాగ్రామ్ డీయాక్టివేషన్‌ గురించి అస్సలు ఒత్తిడికి గురికావద్దని పోస్ట్ పెట్టారు.

అయితే నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మాస్ కా దాస్ ఒక్కసారిగా బ్రేక్ తీసుకోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అస్సలు సోషల్ మీడియాకు ఎందుకు దూరమయ్యారో కూడా చెప్పకపోవడంతో మరింత ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోషల్ మీడియా నుంచి జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నా అంతేనని తెలిపారు.

ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ అలా చూస్తూ ఉండడం వల్ల చాలా టైమ్ వేస్ట్ అయిందని చెప్పారు విశ్వక్ సేన్. రాత్రి వేళల్లో నిద్ర వచ్చినా కూడా.. అలా చూసుకుంటూ ఉండేవాడినని తెలిపారు. అందుకే ఇన్ స్టా డిలీట్ చేశానని, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో లేకపోతే అదేదో పెద్ద తప్పు చేసినట్లు అందరూ చూస్తున్నారని అన్నారు. కొందరు అయితే మన బాడీలో ఒక పార్ట్ మిస్ అయినట్లు చూస్తున్నారని తెలిపారు.

ప్రస్తుత రోజుల్లో ఏ పని చేసినా.. ఫోన్ అందరికీ ఒక వ్యసనంలా మారిపోయిందని అన్నారు విశ్వక్. తింటున్నా.. పడుకున్నా.. ఏం చేసినా.. ఫోనేనని చెప్పారు. అటు ఫ్యామిలీకి.. ఇటు వర్క్ కు.. ఎప్పుడు ఎలా ఎంత టైమ్ ఇవ్వాలో ఇవ్వాలని తెలిపారు. ఓవర్ లిమిట్ లో ఫోన్ వాడుతున్నామని అన్నారు. అందుకే కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఇన్ స్టాగ్రామ్ తీసేసానని చెప్పారు విశ్వక్ సేన్. ప్రస్తుతం యంగ్ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.