#ఆదిత్య 999.. మోక్షజ్ఞ హీరోగా బాలయ్య దర్శకత్వంలో!?


నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటితో హ్యాట్రిక్ మూవీ అఖండ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అఘోరా పాత్రలో అలాగే బిజినెస్ మేన్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ మూవీ తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తారు? అంటే గోపిచంద్ మలినేని .. అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు.. ఆయన కెరీర్ లో మరోసారి భారీ ప్రయోగం చేయబోతున్నారని .. సైన్స్ ఫిక్షన్.. ఫాంటసీ తరహా సినిమాలో నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఆదిత్య 369 మూడు దశాబ్ధాల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కథతో ఎన్.బి.కే సినిమా చేస్తారని కూడా ఇంతకుముందు కథనాలొచ్చాయి. సింగీతం ఇప్పటికే బాలయ్యతో కథా చర్చలు పూర్తి చేశారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం వల్ల భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందట. పైగా బాలయ్యను పాన్ ఇండియా స్టార్ గా చూడాలనేది నందమూరి అభిమానుల కోరిక. అందుకే ఆదిత్య 999 పేరుతో ఈ మూవీని భారీగా తెరకెక్కించే వీలుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి నటసింహా నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇదే చిత్రంతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని ఇందులో బాలయ్య ఓ కీలక పాత్ర పోషిస్తారని కూడా ప్రచారమవుతోంది.

ఇక ఆదిత్య 369 తెలుగు సినిమా హిస్టరీలో చెరిగిపోని ముద్ర వేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. దేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఆదిత్య 369 రికార్డులు క్రియేట్ చేసింది. 18 జూలై 2021 తో మూవీ రిలీజై 30 ఏళ్లు అవుతోంది. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమా ప్రారంభం కావడానికి కారకుడు. ఆయన సింగీతం వినిపించిన కథ విని దానిని నిర్మాత శివలెంక ప్రసాద్ కు చెప్పడం ఆ వెంటనే బాలకృష్ణ ను శ్రీకృష్ణ దేవరాయలుగా ఊహించుకోవడం అటుపై సెట్స్ కెళ్లడం చకచకా జరిగిపోయాయి. అలా బాలయ్య కెరీర్ లో ఒక అద్భుతమైన చిత్రం కుదిరింది. ఇందులో మోహిని కథానాయికగా నటించగా.. సైంటిస్ట్ గా హిందీ నటుడు టీనూ ఆనంద్ అద్భుతంగా నటించారు. ఇళయారాజా మరపురాని బాణీలు అందించారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కి తెలుగు ప్రేక్షకులు సహా వరల్డ్ ఆడియెన్ ని మెప్పించింది. సినిమా ఉత్సవాల్లో పురస్కారాలు అందుకుంది.

సుమారు 110 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసిన ఘనత సింగీతంకి చెందుతుంది. ఇక టైటిల్ విషయంలో కొంత డైలమా నెలకొనగా.. కాలయంత్రం.. యుగపురుషుడు వంటి టైటిల్స్ అనుకుని చివరికి ఈ చిత్రంలో చూపించిన మిషిన్ నంబర్ 369 కాబట్టి ఆదిత్య 369 అని ఫైనల్ చేశారు. అప్పట్లోనే కోటిన్నరతో తెరకెక్కి 10కోట్లు వసూలు చేయడం ఓ సెన్సేషన్. ఇక ప్రెజెంట్ కి వస్తే.. ఆదిత్య 369 సీక్వెల్ కథను బాలయ్య రాసారు. సింగీతంతో కథాచర్చలు సాగించారు. త్వరలోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిత్య 369కి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యాభై ఏళ్లు అయినా ఈ సినిమా ఫ్లేవర్ అలానే ట్రెండింగ్ గా ఉంటుందని అన్నారు. సినిమా ప్రారంభానికి మూల కారకులు సహా నటీనటులు సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు.