దసరా బరిలో బాలయ్య నిలిస్తే..?

దసరా బరిలో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లేదనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో మిగతా సినిమాలన్నీ ఫెస్టివల్ స్లాట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. అఖిల్ అక్కినేని – పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం అక్టోబర్ 8వ తేదీని గీతా ఆర్ట్స్ వారు బ్లాక్ చేశారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘కొండ పొలం’ చిత్రాన్ని కూడా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలానే శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్దార్థ్ కలిసి నటించిన ‘మహాసముద్రం’ చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

అలానే దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి అరంగేట్రం మూవీ ‘రౌడీ బాయ్స్’ ను కూడా దసరా బరిలో దింపుతున్నారు. హోమ్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు పండగ సీజన్ కోసం రెడీ అవుతున్నాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి – కొరటాల శివ ల ‘ఆచార్య’ సినిమా రేసులో లేదని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. బాలకృష్ణ సినిమాని బరిలో నిలుపుతారని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అక్టోబర్ 8 – 13 రెండు డేట్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘అఖండ’ చిత్రం అక్టోబర్ లో వచ్చేది నిజమే అయితే ఈ సీజన్ లో వచ్చే పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఇది బాలయ్య సినిమాకి సువర్ణావకాశం కూడా. అయితే దీని కారణంగా కొన్ని చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకుంటామని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చివరకు దసరా పండుగకు ఏయే సినిమాకమాలు థియేటర్లలోకి వస్తాయో చూడాలి.