తెలంగాణ: ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్-బీజేపీ మాటల యుద్ధం

ధాన్యం కొనుగోలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు రైతులతో వరి వేయించి ఇప్పుడు ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారన్నారు. దీనిని నిజం చేస్తూ కేంద్రం నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్రే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బ్రోకర్ల మాఫియాతో కమీషన్ల కోసం సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈమేరకు రైతులకు ఓ లేఖ రాశారు. రైతులు తక్కువ ధరకే ధాన్యం విక్రయించేలా చేసి ఆ నెపం కేంద్రంపై నెట్టే పథకం పన్నారని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేతే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ కుట్రలను రైతులు తెలుసుకోవాలన్నారు. రైతు పండించే ప్రతి గింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.