టక్ జగదీష్ వల్ల నిర్మాతల మధ్య కలహాలు?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `టక్ జగదీష్`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదలకానుండగా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసినదే.

ఈ సినిమా కోసం నాని కఠోరంగా శ్రమించారు. 70-80 రోజుల షూటింగ్ కోసం టక్ చేసుకుని సెట్స్ లో ఉండాల్సొచ్చిందని.. సినిమా అంతా టక్ తో కనిపిస్తానని నాని ఇంతకుముందు వెల్లడించారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతానని నాని చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న పంతాన్ని కనబరిచారు.

ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో టక్ జగదీష్ ని థియేటర్లలో చూడాలనుకుంటున్నట్టు కూడా నాని అన్నారు. ఈ కష్టకాలంలో ఎగ్జిబిషన్ రంగాన్ని కాపాడాలని కూడా నాని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఇంతలోనే నిర్మాతలు టక్ జగదీష్ రిలీజ్ విషయమై మాట మార్చారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కి 37కోట్లకు విక్రయించారని తెలిసింది. అయితే ఇలా విక్రయించినందుకు నిర్మాత లక్ష్మణ్ పై దిల్ రాజు గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటీటీకి విక్రయించడంతో నాని కూడా సైలెంట్ అయిపోయారని టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ ఫిలింఛాంబర్ నిబంధనల ప్రకారం ఏ సినిమాని అక్టోబర్ చివరి వరకూ ఓటీటీల్లో రిలీజ్ చేయకూడదు. అప్పటికీ రిలీజ్ చేయలేని పరిస్థితిలో మాత్రమే ఓటీటీలకు అమ్ముకోవాలని రూల్ ని ప్రతిపాదించారు. దానిని ధిక్కరించి ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారు? అంటూ దిల్ రాజు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తన మాజీ పార్టనర్ లక్ష్మణ్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత తమ కాంపౌండ్ నుంచి నారప్పను రూల్స్ తో పని లేకుండా ఓటీటీలకు విక్రయించారు. మునుముందు మరో రెండు సినిమాలను డిజిటల్లోనే రిలీజ్ చేయనున్నారు. ఏదేమైనా టక్ జగదీష్ నిర్మాతల మధ్యనే గొడవ పెట్టాడు! అంటూ గుసగుస వినిపిస్తోంది. దిల్ రాజు సంస్థానంలో లక్ష్మణ్ చాలాకాలంగా భాగస్వామి. కానీ ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు సొంత బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు.

ఏపీలో టిక్కెట్టు వెనకడుగు వేయడానికి కారణమా?

ఏపీలో టిక్కెట్టు ధరల విషయమై సర్కార్ నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. అయితే అక్కడ నష్టాలొస్తే తెలంగాణలో లాభాలొచ్చినా ఏ ప్రయోజనం? అందుకే ఇరు రాష్ట్రాల్లో థియేటర్ యజమానులు పంపిణీదారులు ఆందోళనలోనే ఉన్నారు. నిర్మాతలకు కూడా ఏపీ సర్కార్ వ్యవహారం మింగుడు పడడం లేదు. ముందస్తుగానే తెలంగాణలో థియేటర్లు తెరవక ముందే ఏపీలో టిక్కెట్టు ధరల పెంపుపై తెలంగాణ ఫిలింఛాంబర్ ఇంతకుముందే ఏపీ ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు ఒక మెమోరండాన్ని పంపారు. కానీ దానిపై ఏపీ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించలేదు. టిక్కెట్టు ధరలపై మొండి పట్టు వీడలేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి కారణం వల్ల కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవాలన్న ఆలోచనకు నిర్మాతలు వెలుతున్నారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ల వరకూ పార్కింగ్ ఫీజ్ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించడం ఎగ్జిబిటర్లకు కొంతవరకూ ప్లస్ అయ్యింది.