#RC15 శంకర్ తో సెట్ చేసింది ఎవరో తెలుసా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రాన్ని దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇలా శంకర్-చరణ్- దిల్ రాజ్ కాంబో మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే అంతకు ముందే శంకర్ తో ఇండియన్ -2 చిత్ర నిర్మాణంలో దిల్ రాజు భాగమయ్యారు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం మళ్లీ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు సోలో నిర్మాతగా బరిలో దిగారు. ఆయన సాహసం నిజంగా ప్రశంసించదగినది.

సాధారణంగా ఒక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని మళ్లీ అదే దర్శకుడితో సినిమా ఛాన్స్ అంటే.. అదీ శంకర్ లాంటి దర్శకుడితో సినిమా అంటే అంత సులువేమీ కాదు. కానీ రాజుగారు తెలివితేటలతో దాన్ని సుసాధ్యం చేసారు. మరి ఇదెలా సాధ్యమైందంటే ఆసక్తికర సంగతులే తెలిసాయి. ఈ ముగ్గురిని కలపడంలో ఎన్. నరసింహరావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నరసింహరావు ఎవరు? అంటే శంకర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. శంకర్ తో ఆయనకి కొన్నేళ్లగా సాన్నిహిత్యం ఉందిట. ఆ కారణంగానే దిల్ రాజు ని శంకర్ వద్దకు తీసుకెళ్లి చరణ్ తోప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

నరసింహరావుతో దిల్ రాజుకి రిలేషన్ ఎక్కడిది? అంటే.. అప్పట్లో రాజుగారు కాంపౌండ్ లో వి.వి. వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ కూడా జరిగి అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆ సినిమా దర్శకుడే ఈ నరసింహరావు. అప్పటి నుంచి రాజుగారితో నరసింహారావుకి మంచి బాండింగ్ ఉంది. అందుకే సినిమా ఆగిపోయినా రిలేషన్ కోసం శంకర్ తో దిల్ రాజును ఆయన కలిపారు. ఇటీవలే చెన్నై వెళ్లి శంకర్ ని చరణ్- దిల్ రాజు కలిసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ఉన్న ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. కానీ అందులో నుంచి నరసింహరావు హైడ్ అయ్యారు. కానీ తెర వెనుక అసలు పాత్ర దారి ఈయనే. అలాగే నరసింహరావు `శరభ` అనే ఓ సినిమా కూడా తెరకెక్కించారు.