ఓటిటి రిలీజ్ విషయంలో నానికి మద్దతుగా నిలిచిన గోపీచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం సీటిమార్. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతోంది. గోపీచంద్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఓటిటి రిలీజ్, థియేట్రికల్ రిలీజ్ పై పెద్ద చర్చ నడుస్తోంది.

దీనిపై గోపీచంద్ స్పందించాడు. “ప్రతీ నిర్మాత తన సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తాడు. నిర్మాత కష్టాలు ఏమిటో తెలియాలంటే నిర్మాత అవ్వాలి. నేను ఓటిటి రిలీజ్ లను తప్పు పట్టను. ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి” అని గోపీచంద్ వ్యాఖ్యానించాడు.

ఇటీవలే టక్ జగదీష్ ఓటిటిలో విడుదల కావడంపై పెద్ద దుమారమే రేగింది. అయితే ప్రస్తుతం గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు నానికి మద్దతుగా నిలుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. టక్ జగదీష్ సెప్టెంబర్ 9 రాత్రి విడుదలవుతోంది.