‘టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం..’ నెటిజన్ల ప్రశ్నలు కేటీఆర్ సమాధానాలు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని.. అయినా ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధించి తెలంగాణలో పరిపాలన కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వదని తేలిపోయింది. 2014లో గ్యాస్ సిలెండర్ ధర 410 ఉంటే.. ఇప్పుడు వెయ్యి దాటింది. అచ్చే దిన్ అంటే ఇదేనా..?

అప్పట్లో సిలెండర్ ధర 50 పెరిగితే యూపీఏను విమర్శించిన స్మృతి ఇరానీ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు..? బీజేపీ అంటే బేచో జనతాకీ ప్రాపర్టీ.. ప్రజల ఆస్తులు అమ్మేయడం. కేంద్రంలో బీజేపీ వల్ల బీజేపీయేతర రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనిపై ఆయా రాష్ట్రాలు కలసికట్టుగా పోరాడాలి. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం ప్రపంచ రికార్డులే సృష్టిస్తోంది. పైగా.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని మోదీ చెప్పడం హాస్యాస్పదం. రాహుల్ అమేధీలో గెలిచి మాట్లాడాలి.

తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉంది. కరోనా పరిస్థితుల తర్వాత ఆరోగ్య రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. హైదరాబాద్ లో 3 టిమ్స్, 33 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తోంది. హైదరాబాద్ లో త్వరలో వంద శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల్లో నీటి కాలుష్యం తగ్గుతుంది. టీఆర్ఎస్ ను జాతీయస్థాయిలో విస్తరిస్తారా అంటే.. ఏమైనా జరగొచ్చు.. చెప్పలేం.

తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నా.. జాతీయ స్థాయిలో ఆలోచించలేదు. హైదరాబాద్ లో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఈకో సిస్టం అభివృద్ధి జరుగుతోంది. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నగరంలో ఎందుకు జరగట్లేదో గంగూలీ, జైషాలే చెప్పాలి. గ్రూప్ 1లో ఉర్దూపై కొన్ని పార్టీలు చేసే తప్పుడు వార్తలను నమ్మొద్దు. ఒకప్పుడు కరువుతో అల్లాడిని పాలమూరు జిల్లా పచ్చగా మారడం సంతోషంగా ఉంది.