మహేష్‌ తీసేసినా వెలిగిపోతోంది

మహేష్‌, కొరటాల శివ చిత్రంలో ముందుగా కీర్తి సురేష్‌ కథానాయికగా ఎంపికైంది. అయితే డేట్స్‌ క్లాష్‌ అవుతున్నాయని ఆమెని తొలగించి బాలీవుడ్‌ నటి కియారా అద్వానీకి ఛాన్స్‌ ఇచ్చారు. మహేష్‌లాంటి పెద్ద స్టార్‌తో ఛాన్స్‌ మిస్‌ అవడం కీర్తిని ఇబ్బంది పెట్టేదే.

అయితే దాని గురించి బెంగ పడాల్సిన పని లేకుండా ఆమెకి వరుస పెట్టి పెద్ద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోన్న కీర్తి, ‘సావిత్రి’ జీవిత కథతో రూపొందుతోన్న ‘మహానటి’లో టైటిల్‌ రోల్‌ చేస్తోంది. తమిళంలో విజయ్‌, అజిత్‌, సూర్య లాంటి టాప్‌ స్టార్స్‌ అందరితోను నటిస్తూ బిజీగా వుంది.

తాజాగా విక్రమ్‌ సినిమాలోను కీర్తి ఛాన్స్‌ కొట్టేసింది. ‘సామి’ చిత్రానికి హరి తలపెట్టిన సీక్వెల్‌లో కీర్తి సురేష్‌ ఒక కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం తమిళనాట తనంత బిజీగా వున్న హీరోయిన్‌ ఇంకొకరు లేరు. త్రిష, నయనతార తర్వాత అగ్ర హీరోలు అందరూ సైన్‌ చేసుకుంటోన్న హీరోయిన్‌ కీర్తినే.

పవన్‌ సినిమా రిలీజ్‌ అయిందంటే తెలుగులోను ఆమె స్టార్‌డమ్‌ పెరిగిపోతుంది. నేను శైలజ, నేను లోకల్‌తో వరుస సూపర్‌హిట్లు వున్నాయి కనుక ఇక తనకి కావాల్సిందొక పవర్‌ఫుల్‌ హిట్టే. అదీ వచ్చేస్తే ఇప్పుడు మిస్‌ అయిన మహేష్‌ సినిమా త్వరలోనే తనని వరించినా వరిస్తుంది.


Recent Random Post: