టైటిల్ లీక్ గురించి కుండబద్దలు కొట్టేసిన మహేశ్

మహేశ్ బాబు వరుసగా మూడు భారీ విజయాలను అందున్నాడు. హ్యాట్రిక్ హిట్ తరువాత ఆయన చేసిన సినిమానే ‘సర్కారువారి పాట’. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన కథా కథనాలతో రూపొందిన సినిమా ఇది.

మహేశ్ బాబులోని రొమాంటిక్ యాంగిల్ ను కాస్త పెంచి చూపించిన సినిమా ఇది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ – పరశురామ్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకి తగిన టైటిల్ ఇదేననీ .. మరో టైటిల్ ఊహించలేమని పరశురామ్ చెబుతూ వచ్చాడు. ఒకవేళ మరే టైటిల్ పెట్టినా అది సెట్ కాదని ఆయన తేల్చి చెప్పాడు. టైటిల్ తట్టగానే తాను మహేశ్ బాబుకి కాల్ చేసి చెప్పాననీ వెంటనే ఆయన అదిరిపోయిందని అన్నారని చెప్పాడు. అలా టైటిల్ ఖరారైపోయిందని అన్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో మహేశ్ బాబు అందుకు భిన్నంగా స్పందించాడు. టైటిల్ లీక్ అయిన తరువాతనే తనకి తెలిసిందని కుండబద్దలు కొట్టేశాడు.

ఆ రోజున నేను జిమ్ లో ఉన్నాను .. నమ్రత వచ్చి టైటిల్ లీక్ అయిపోయిందని చెప్పింది. అప్పటివరకూ నాకూ తెలియదు టైటిల్ ఏమిటో. అప్పుడు నేను పరశురామ్ గారికి కాల్ చేసి .. ఏంటి సార్ టైటిల్ అని అడిగాను. అమెరికాలో ఆల్రెడీ టైటిల్ గురించి మాట్లాడేసుకుంటున్నారట .. లీక్ అయిందని అన్నారు.

ఏంటండీ టైటిల్ అంటే .. ‘సర్కారువారి పాట’ అన్నారు. ‘అదిరిపోయింది .. కానీయండి ‘ అన్నాను. కథలో నుంచి వచ్చిన టైటిల్ అది .. వెంటనే కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఇక ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజునే ఎనౌన్స్ చేయడం జరిగింది.

పోస్టర్ లాంటివి లీక్ కావొచ్చును గానీ .. టైటిల్ ఎలా లీక్ అయిందనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు పరశురామ్ జోక్యం చేసుకుంటూ .. ‘ డిజైన్ చేయమని వాళ్లకీ .. వీళ్లకి ఇస్తుంటాం కదండీ .. అంటూ ఏదో సర్ది చెప్పబోయాడు. లీక్ చేస్తున్నవాళ్లు చాలా జన్యూన్ గా .. చాలా ప్రేమతో చేస్తున్నారు’ అంటూ సుమ కామెడీ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో బన్నీ ఉన్నాడని అంటున్నారు. చైతూ – పరశురామ్ ప్రాజెక్టు తరువాత ఈ సినిమా ఉంటుందేమో చూడాలి.